Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. రాష్ట్రంలో తొలి హైటెక్ హైవే నిర్మాణం.. ఎక్కడంటే..?
రాష్ట్రంలో త్వరలో తొలి హైటెక్ హైవే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పనులు శరవేగంగా జరుగుతుండగా.. జూన్ నాటికి ప్రారంభం కానుంది. ఇది రాకతో రాష్ట్ర రూపురేఖలే పూర్తిగా మారనున్నాయి. మెరుగైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సౌకర్యాలు ఈ హైవేలో అందుబాటులో ఉంటాయి.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే దీని నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. త్వరలోనే దీనిని ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు ఈ హైవే విస్తరించి ఉండనుంది. దాదాపు రూ.4,451.87 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించగా.. సుమారు 162.4 కిలోమీటర్ల మేర ఉండనుంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన దీనిని హైటెక్ హైవేగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే ఇదే కావడం విశేషం. అలాగే తెలంగాణలో తొలి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా నిలవనుంది. దీనికి సంబధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
జూన్ నాటికి ప్రారంభం
ఈ కొత్త హైటెక్ హైవేను జూన్ నాటికి ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అప్పటినుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తు్న్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం సుభతరం కావడంతో పాటు దూరం తగ్గనుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లేవారికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఇప్పటివరకు విశాఖపట్నం వెళ్లాలంటే సూర్యాపేట, విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంది. దీని దూరం 676 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ కొత్త హైటెక్ హైవేతో 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. అలాగే ట్రాఫిక్ రద్దీ కూడా ఉండకపోవడం వల్ల ఈ హైవే ద్వారా వేగంగా విశాఖకు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి విశాఖవైపు వెళ్లేవారికి దీని వల్ల ప్రయోజనం కలగనుంది.
ఏఐ సీసీ కెమెరాలు
2017లో ఈ హైటెక్ హైవే కోసం ప్రతిపాదనలు సిద్దం చేశారు. 2018లో కేంద్రం నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం 116 కిలోమీటర్ల పనులు పూర్తవ్వగా.. మిగిలిన 20 శాతం పనులు కూడా త్వరలో పూర్తి చేయనున్నారు. నాలుగు లైన్లుగా ఈ హైవే ఉంటుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేపై అత్యవసర మీడియా ఓపెనింగ్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే వాహనదారులకు అత్యవసర సాయం కోసం 1033 హెల్ప్ లైన్ నెంబర్, సీసీ కెమెరాలు ఉంటాయి. ఇక 98 అండర్ పాస్లు, 295 కల్వర్టులు ఉంటాయి. ఏఐ టెక్నాలజీతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రతీ 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఉంటాయి. ఇక బారికేడింగ్ వల్ల మధ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉండదు. ఈ హైవే రాకతో ఖమ్మం జిల్లా బాగా అభివృద్ది చెందనుంది. కొత్త పరిశ్రమల రాకతో స్థానిక యువతకు బెనిఫిట్ జరగనుంది.
