Hyderabad TIMS: వారికి ప్రత్యేక వైద్యం.. టిమ్స్లో సౌకర్యాలు మామూలుగా లేవుగా.. ప్రారంభోత్సవం ఎప్పుడంటే..
తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులను కేవలం రాష్ట్ర ప్రజలకే కాకుండా.. విదేశీ రోగులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులను కేవలం రాష్ట్ర ప్రజలకే కాకుండా.. విదేశీ రోగులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ ప్రాంతం.. అల్వాల్, సనత్ నగర్, కొత్తపేట ప్రాంతాల్లో టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న సనత్ నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులను ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్ మెడికల్ టూరిజం హబ్గా పేరుగాంచిన నేపథ్యంలో.. ఆ అవకాశాన్ని మరింతగా వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. విదేశాల నుంచి వచ్చే రోగులను ఆకర్షించేందుకు ప్రతి టిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా 50 పడకలను కేటాయించనుంది. అంతేకాదు, ఆయా దేశాల ప్రభుత్వాలతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకుని (జీ టు జీ మోడల్) రోగులను తీసుకురావాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ముఖ్యంగా ఆఫ్రికా, అరబ్ దేశాల నుంచి హైదరాబాద్కు చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. వారిని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ ఆస్పత్రుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక “ఇంటర్నేషనల్ పేషెంట్ వింగ్”లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇప్పటివరకు విదేశీ రోగులు ఎక్కువగా ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే అక్కడ భారీ ఖర్చులు భరించాల్సి వస్తుండటంతో.. అదే స్థాయి వైద్య సేవలను తక్కువ ఖర్చుతో ప్రభుత్వ రంగంలో అందించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందింది.
హృదయ శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, క్యాన్సర్ వంటి క్లిష్టమైన చికిత్సలను కూడా టిమ్స్ ఆస్పత్రుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం మీద.. టిమ్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో కొత్త ప్రమాణాలు సృష్టించడంతో పాటు మెడికల్ టూరిజాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అత్యాధునికంగా టిమ్స్ ఆసుపత్రి..
హైదరాబాద్ నడిబొడ్డున అధునాతన టిమ్స్ ఆసుపత్రిని.. 1100 కోట్ల అంచనాతో G+5 డిజైన్ తో అత్యాధునికంగా నిర్మించారు. రోగుల కోసం 1,000 పడకలు ఉండనున్నాయి. 250 మందికి పైగా నిపుణులైన వైద్యులు, వందలాది మంది నర్సులు, టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు పనిచేయనున్నారు. సహాయకుల కోసం 220 పడకలతో 5 అంతస్తుల ధర్మశాల.. 24 ఎలివేటర్లు, విశాలమైన అంతర్గత రహదారులు, పార్కింగ్ ఉండనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
