పాము కొరికిన పండ్లు తింటే చనిపోతారా..? అపోహలు కాదు అసలు నిజాలు ఇవే..
మన సమాజంలో పాముల చుట్టూ అల్లబడిన కథలు, అపోహలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పల్లెల్లో ఒక బలమైన నమ్మకం ఉంది.."పాము ఏదైనా పండును కొరికితే అది విషపూరితం అవుతుంది, దాన్ని తింటే మనిషి అక్కడికక్కడే మరణిస్తాడు." ఈ భయం వల్ల ఎంతో పౌష్టికాహారం వృథా అవడమే కాకుండా ప్రజలు అనవసర ఆందోళనకు గురవుతున్నారు. అసలు పాము విషం మన జీర్ణవ్యవస్థలోకి వెళ్తే ఏం జరుగుతుంది? తెలుసుకుందాం..

పాములు ప్రకృతి సిద్ధంగా ఆబ్లిగేట్ కార్నివోర్స్. అంటే ఇవి కేవలం మాంసాహారాన్ని మాత్రమే భుజిస్తాయి. వీటి దవడలు, పళ్లు, జీర్ణరసాలు ఎలుకలు, కప్పలు వంటి జీవులను వేటాడి అరిగించుకోవడానికే నిర్మితమయ్యాయి. పాములకు పండ్లను కొరికే అలవాటు గానీ, అవసరం గానీ లేదు. సాధారణంగా పండ్లపై కనిపించే పంటి గుర్తులు గబ్బిలాలు, ఉడుతలు, ఎలుకలు లేదా పక్షులవి అయి ఉంటాయి. పాము తన విషాన్ని కేవలం ఆత్మరక్షణకు లేదా వేటను చంపడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. ఊరికే పండ్లపై విషం చిమ్మడం అనేది ప్రకృతి విరుద్ధం.
వెనమ్ vs పాయిజన్: ఈ తేడా మీకు తెలుసా..?
చాలామంది విషం అంటే ఏదైనా ఒక్కటే అనుకుంటారు. కానీ విజ్ఞానశాస్త్రం వీటిని రెండుగా విభజించింది..
వెనమ్ : పాము విషం ఈ కోవలోకి వస్తుంది. ఇది రక్తంలోకి ఇంజెక్ట్ చేయబడినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అంటే పాము కాటు వేసి రక్తం ద్వారా శరీరంలోకి విషాన్ని పంపాలి.
పాయిజన్ : ఇది తిన్నప్పుడు, పీల్చినప్పుడు లేదా చర్మానికి తగిలినప్పుడు హాని చేస్తుంది.
మన కడుపులోని హీరో.. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
ఒకవేళ అసంభవమైన రీతిలో పాము విషం పండులోకి చేరి, దాన్ని మీరు తిన్నారనే అనుకుందాం. అది కడుపులోకి వెళ్లగానే మన జీర్ణ వ్యవస్థ తన పని మొదలుపెడుతుంది. పాము విషం ప్రాథమికంగా ప్రోటీన్లు, ఎంజైములతో తయారవుతుంది. మనం తిన్న పప్పులు లేదా గుడ్లలోని ప్రోటీన్లు ఎలాగైతే విచ్ఛిన్నం అవుతాయో, పాము విషం కూడా అలాగే విడిపోతుంది. మన జీర్ణాశయంలో ఉండే అత్యంత శక్తివంతమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లంఈ విషపూరిత ప్రోటీన్లను క్షణాల్లో నిర్వీర్యం చేస్తుంది. కడుపులోకి వెళ్లిన విషం రక్తంలో కలవదు కాబట్టి అది తన విష ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతుంది.
ప్రమాదం ఎప్పుడు సంభవించవచ్చు?
మీ నోటి నుండి కడుపు వరకు ఉన్న మార్గంలో ఎక్కడా గాయాలు ఉండకూడదు.
నోటి పుండ్లు, చిగుళ్ల వ్యాధి: నోట్లో పుండ్లు ఉండి రక్తం కారుతుంటే, ఆ గాయాల ద్వారా విషం నేరుగా రక్తంలో కలిసే అవకాశం ఉంది.
అల్సర్లు: జీర్ణాశయం లేదా అన్నవాహికలో తీవ్రమైన అల్సర్లు ఉన్నప్పుడు కూడా అది రక్త ప్రవాహంలోకి చేరే ప్రమాదం ఉంటుంది.
ఈ రెండు లేనప్పుడు పాము విషాన్ని తాగినా ఏమీ కాదని గతంలో కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు.
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పరిశుభ్రత: పండ్లు లేదా కూరగాయలపై పక్షి రెట్టలు, జంతువుల ఉమ్మి ఉండవచ్చు. కాబట్టి వాటిని ఉప్పు నీటిలో లేదా పారే నీటిలో 2-3 సార్లు కడగడం వల్ల ఇన్ఫెక్షన్లు రావు.
వంట: కూరగాయలను బాగా ఉడికించడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా, ఒకవేళ ఏదైనా విష పదార్థం ఉన్నా అది నశిస్తుంది.
పరిశీలన: ఎక్కువగా దెబ్బతిన్న, కుళ్లిపోయిన లేదా అసాధారణంగా కొరికిన గుర్తులు ఉన్న పండ్లను పారేయడమే ఉత్తమం. ఎందుకంటే వాటి ద్వారా రేబిస్ వంటి ఇతర వైరస్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
నిజమైన వాస్తవం
పాము కాటు వేసిన పండు తింటే మరణం సంభవిస్తుందనేది ఒక అశాస్త్రీయమైన అపోహ. పాము విషం రక్తంలో కలిస్తేనే మృత్యువు, కడుపులోకి వెళ్తే అది కేవలం జీర్ణమయ్యే ప్రోటీన్.
