Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. ఈ 5 మార్గాల్లో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. సాఫీగా జర్నీ..
హైదరాబాద్ ప్రజలకు భారీ శుభవార్త. టీజీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ నగరంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కొత్తగా మరికొన్ని బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారు. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ వాసులకు టీజీఎస్ఆర్టీసీ తీపికబురు అందించింది. మరికొన్ని కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 37 ఎలక్ట్రిక్ బస్సులను నూతనంగా ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ వాహనాలు నగారానికి చేరుకోగా.. ప్రయాణికుల కోసం సర్వీసులు నడిపేందుకు కొంత సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. ఆలస్యం కావడానికి ప్రధాన కారణం డ్రైవర్ల కొరతేనని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అర్హత కలిగిన డ్రైవర్లు అందుబాటులో లేరు. డ్రైవర్లకు మెడికల్ టెస్టులు,డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ వీటిల్లో చాలామంది అర్హత సాధించలేకపోవడం వల్ల డ్రైవర్ల నియామకంలో ఆలస్యం చోటుచేసుకుంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ఈ మార్గాల్లో తిరగనున్న కొత్త బస్సులు
ఎలక్ట్రిక్ బస్సుల్లో డ్రైవర్ల నియామకానికి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. కానీ టెస్టుల్లో అర్హత సాధించినవారికి ప్రత్యేకంగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతనే వారికి ఎలక్ట్రిక్ బస్సులను నడిపే బాధ్యతలను అప్పగిస్తున్నారు. త్వరలోనే డ్రైవర్ల నియామకం పూర్తయిన తర్వాత కొత్త 37 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురానున్నారు. ఈ బస్సులు 5 మార్గాల్లో తిరగనున్నాయని తెలుస్తోంది. సనత్నగర్ నుంచి శంకర్పల్లి బస్ స్టేషన్, మెహిదీపట్నం టు ప్రగతినగర్. జగద్గిరిగుట్ట టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు మియాపూర్ క్రాస్రోడ్, పటాన్చెరు బస్టాండ్ టు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మధ్య వీటిని తిప్పనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో అనే మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడంలో ఇవి ఉయోగపడుతున్నాయి. కాలుష్య నివారణకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. రానున్న రోజుల్లో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానుంది. ఇటీవల కూకట్ పల్లి డిపో పరిధిలో 23 ఎలక్ట్రిక్ బస్సులను టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బస్సు 5 వేర్వేరు మార్గాల్లో సర్వీసులు అందిస్తున్నాయి. వీటికి ప్రజల నుంచి అద్బుత స్పందన వస్తోంది. దీంతో మరిన్ని బస్సులను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నగరంలో డీజిల్ బస్సులు కనిపించవ్..
రాబోయే రోజుల్లో నగరంలో డీజిల్ బస్సులు అనేవి కనిపించవు. అన్ని ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిప్పేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో జనాభా పెరుగుతుండటంతో రోజురోజుకి కాలుష్యం పెరుగుతోంది. దీంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. డీజిల్ బస్సులను దశలవారీగా తొలగించనుంది. కాలం చెల్లిన డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. దీంతో భవిష్యత్తులో నగరంలో కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే సర్వీసులు అందిస్తాయి. పర్యావరణాన్ని కాపాడటంతో ఈ చర్య ఉపయోగపడనుంది.
