AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మరీ ఇలా ఉన్నవేంట్రా బాబు..! రూ.10కి సాంబార్‌ ఇవ్వలేదని తల్వార్‌తో దాడి.. ఆ తర్వాత

సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ఓ కర్రీ పాయింట్‌లో రూ.20 సాంబార్ తగ్గింపు విషయంలో మద్యం మత్తులో ఉన్న జీవన్, క్యాషియర్ ఉదయ్‌పై తల్వార్‌తో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఉదయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు జీవన్ పరారీలో ఉన్నాడు, పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

Hyderabad: మరీ ఇలా ఉన్నవేంట్రా బాబు..! రూ.10కి సాంబార్‌ ఇవ్వలేదని తల్వార్‌తో దాడి.. ఆ తర్వాత
Beeramguda Sambar Incident
P Shivteja
| Edited By: |

Updated on: Apr 26, 2026 | 11:35 AM

Share

కర్రి పాయింట్‌లో సాంబార్ వివాదం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ముప్పై రూపాయల సాంబార్ పది రూపాయలకే ఇవ్వాలని అడగ్గా.. అలా కుదరదు అని చెప్పాడు.. దీంతో ఏకంగా తల్వార్ తో దాడి చేశాడు ఓ వ్యక్తి.. హైదరాబాద్ శివారు బీరంగూడలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో కేవలం 20 రూపాయల తగ్గింపు కోసం తల్వార్‌తో క్యాషియర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు ఓ వ్యక్తి.. మద్యం మత్తులో హల్‌చల్ చేస్తూ షట్టర్ క్లోజ్ చేసి మరీ క్యాషియర్‌ పై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ఒక స్థానిక కర్రీ పాయింట్ ఎప్పటిలాగే కస్టమర్లు వచ్చి వెళ్తున్నారు.. ఇంతలో జీవన్ అనే వ్యక్తి మద్యం మత్తులో అక్కడికి వచ్చాడు. 30 రూపాయల విలువైన సాంబార్‌ను 10 రూపాయలకే ఇవ్వాలని క్యాషియర్ ఉదయ్‌తో గొడవకు దిగాడు. ఉదయ్ నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జీవన్, తన వెంట తెచ్చుకున్న తల్వార్‌తో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. దాడి సమయంలో భయంతో ఇతర సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అయితే.. జీవన్ ఏకంగా షట్టర్ మూసివేసి ఉదయ్‌ను లోపల బంధించాడు. తల్వార్‌తో ఉదయ్ తలపై బలంగా నరికాడు.

ప్రాణ భయంతో ఉదయ్ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. వెంటనే షట్టర్ తీసి అతడిని కాపాడారు. తీవ్ర గాయాలైన ఉదయ్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వీడియో చూడండి..

ఈ ఘటన అనంతరం.. నిందితుడు జీవన్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మద్యం మత్తులో ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Follow Us