Telangana: మనవడే యముడయ్యాడు.. బైక్ కొనేందుకు నగలు ఇవ్వలేదని.. ఫ్రెండ్తో కలిసి..
ఆశకు అంతు లేదు.. అనుబంధాలకు విలువ లేదు అన్నట్లుగా మారింది ప్రస్తుత సమాజం. బైక్ కొనుక్కోవాలనే ఓ జల్సా రాయుడి కోరిక.. ఏకంగా అమ్మమ్మ ప్రాణాలనే బలి తీసుకుంది. బండి కొనేందుకు అమ్మమ్మ ఒంటిపై ఉన్న నగలపై కన్నేసిన మనవడు.. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమెది సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్క కటకటాల పాలయ్యాడు.

మెదక్ జిల్లా రామాయంపేటలో ఈ నెల 18వ తేదీన జరిగిన వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. డబ్బు కోసం మనవడే ఆమెను హతమార్చినట్టు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18న సాయమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుండెపోటుతోనే ఆమె చనిపోయిందని మనవడు విశాల్ నాటకమాడాడు. కానీ కొడుకు శ్యామ్కు తల్లి మృతిపై అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇక కొడుకు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు ఘోరం వెలుగుచూసింది.
పోలీసుల విచారణలో నిందితుడు మనవడు విశాల్ క్రూరత్వం బయటపడింది. కొత్త బైక్ కొనాలనుకున్న విశాల్ అందుకోసం అమ్మమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేశాడు. నగలు ఇవ్వాలని అమ్మమ్మను అడగగా ఆమె నిరాకరించింది. దీంతో ఎలాగైనా ఆమె ఒంటిపై నగలను కాజేయాలనుకున్న విశాల్ మెదడులో కంత్రి ఐడియా మెదిలింది. బయట షాప్కు వెళ్లి కొన్ని నిద్రమాత్రలు తీసుకొచ్చాడు. వాటిని తన అమ్మమ్మతాగే కల్లులో కిలిపి ఆమెకు ఇచ్చాడు.
ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత..తన స్నేహితుడు ప్రశాంత్తో కలిసి ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు గుండెపోటుతో చనిపోయిందని అందరినీ నమ్మించాడు. కానీ విశాల్ తండ్రికి మాత్రం ఏదో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల గుట్టు రట్టు చేశారు.
తన స్నేహితుడు ప్రశాంత్తో కలిసి తానే అమ్మమ్మను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో మనవడు విశాల్ ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. క్షణికావేశం, జల్సాల కోసం రక్తసంబంధాలనే పొట్టనబెట్టుకుంటున్న యువత తీరుపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
