Miss World 2025: మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలకు సీఎం రేవంత్ దూరం.. ఎందుకంటే?
72వ మిస్ వరల్డ్ పోటీలు భాగ్య నగరంలో శనివారం (మే 10) సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకానున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ మిస్ వరల్డ్ పోటీలు వాయిదా పడతాయని సర్వత్రా భావించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని నిర్వహించితీరుతామని షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే నేటి ప్రారంభోత్పవ కార్యక్రమానికి సీఎం రేవంత్..

హైదరాబాద్, మే 10: ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు భాగ్య నగరంలో శనివారం (మే 10) సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా వేడుక షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ మిస్ వరల్డ్ పోటీలు వాయిదా పడతాయని సర్వత్రా భావించారు. అయితే ఈ పుకారులను కొట్టివేస్తూ షెడ్యూల్ ప్రకారంగానే శనివారం సాయంత్రం నుంచి మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య హైదరాబాద్లో ఈ రోజు సాయంత్రం 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం రంగం సిద్ధం చేసింది. తాజాగా విడుదలైన షెడ్యూల్ మేరకు ఈ రోజు నుంచి మే 31 వరకు దాదాపు 22 రోజుల పాటు అందాల పోటీలు జరగనున్నాయి.
ప్రారంభ వేడుకను గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంకానున్నారు. భారత సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున మిస్ వరల్డ్ సుందరీమనులకు చౌమహల్ల ప్యాలెస్ లో ఇవ్వాలనుకున్న డిన్నర్ సైతం క్యాన్సిల్ చేసినట్లు రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి ప్రకటన విడుదలైంది.
కాగా హైదరాబాద్ మహానగరం తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యమిస్తోంది. అందాల పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తొలుత ప్రకటన వెలువడినప్పటికీ పాక్-భారత్ ఉద్రిక్తతల నడుమ సీఎం రేవంత్ ఈ పోటీలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. దాదాపు 120 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 111 మంది మన నగరానికి చేరుకోగా.. వారికి తెలంగాణ సంప్రదాయలతో ఎయిర్పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు. జూన్ 1వ తేదీన హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. మొదటి 3, 4 స్థానాల్లో నిలిచిన సుందరీమణులు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటారు. కాగా మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ (2024) ఫైనల్ పోటీలు ముంబైలో జరిగాయి. వరుసగా రెండోసారి పోటీలు ఇండియాలోనే జరుగుతుండటం విశేషం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.