AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..! ఢిల్లీ ఎయిర్ ఇండియా ఘటనలో దారుణ నిజాలు

ఫుకెట్‌-ఢిల్లీ ఎయిర్‌ ఇండియా విమానం ఆగస్టు 4న ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తు కోల్పోయింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. పైలట్‌పై ఓ ప్రయాణికుడు సంచలన ఆరోపణలు చేయగా, కెప్టెన్‌ డోపింగ్‌ పరీక్షలో విఫలమైనట్లు వర్గాలు తెలిపాయి.

గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..! ఢిల్లీ ఎయిర్ ఇండియా ఘటనలో దారుణ నిజాలు
Air India Phuket Delhi Flight
SN Pasha
|

Updated on: Aug 12, 2026 | 10:20 AM

Share

ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటనపై ఓ ప్రయాణికుడు సంచలన ఆరోపణలు చేశారు. ఆగస్టు 4న 137 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో బయలుదేరిన ఏఐ-2379 విమానం ప్రయాణంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తును కోల్పోయింది. ఈ ఘటనలో కనీసం 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు.

విమానం ఒక్కసారిగా కిందికి..

ఎయిర్‌ ఇండియా అంతర్గత భద్రతా నివేదిక ప్రకారం.. విమానంలో స్టాల్‌ వార్నింగ్‌ రావడంతో ఫస్ట్‌ ఆఫీసర్‌ వెంటనే స్టాల్‌ రికవరీ చర్యలు చేపట్టారు. ఆటోపైలట్‌ డిస్‌ఎంగేజ్‌ కావడంతో విమానం ముక్కు పైకి లేచిన సమయంలో, ఫస్ట్‌ ఆఫీసర్‌ విమానం ముక్కును కిందికి వంచారు. దీంతో విమానం తీవ్ర నెగటివ్‌-జీ పరిస్థితిలోకి వెళ్లింది. కొద్దిసేపు ప్రయాణికులు, సిబ్బంది సహా వస్తువులు గాల్లో తేలినట్లు నివేదిక పేర్కొంది. కెప్టెన్‌ కూడా కాక్‌పిట్‌లో గాల్లోకి ఎగిరిపోయే పరిస్థితి ఎదుర్కొన్నట్లు నివేదికలో వివరించారు. అనంతరం తన సీటులోకి చేరుకుని సీట్‌బెల్ట్‌ ధరించి నియంత్రణ బాధ్యతలు చేపట్టారు. విమానం వేగం, ఎత్తు మరింత తగ్గకుండా థ్రాటిల్‌ను గరిష్ట నిరంతర థ్రస్ట్‌కు పెంచారు. చివరకు విమానం పరిస్థితిని అదుపులోకి తీసుకుంది.

హైడ్రాలిక్‌ వ్యవస్థలపై అనుమానాలు

ఘటన తర్వాత విమానంలోని హైడ్రాలిక్‌ వ్యవస్థల్లో అసాధారణ పరిస్థితులు నమోదైనట్లు ఇంజినీరింగ్‌ లాగ్‌లు వెల్లడించాయి. మొదట గ్రీన్‌ హైడ్రాలిక్‌ సిస్టమ్‌, ఆ తర్వాత బ్లూ, ఎల్లో సిస్టమ్‌లలో అల్పపీడనం నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఆటోపైలట్‌ డిస్‌ఎంగేజ్‌ కావడంతో పాటు ఎడమ, కుడి ఎలివేటర్‌ లోపం సూచన కూడా వచ్చింది. విమానం ఒక్కసారిగా పైకి లేచిన ఘటనకు పిచ్‌ కంట్రోల్‌లో సమస్య కారణమైందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రయాణికుడి సంచలన ఆరోపణలు

ఇదిలా ఉండగా.. విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తి కెప్టెన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. విమానం ఎక్కే సమయంలోనే పైలట్‌ మత్తులో ఉన్నట్లు తనకు అనిపించిందని తెలిపారు. పైలట్‌ చాలా నెమ్మదిగా స్పందించాడని, కళ్లూ ఎర్రగా కనిపించాయని చెప్పారు. అయితే ఇవి ప్రయాణికుడి ఆరోపణలు మాత్రమేనని, దర్యాప్తులో అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. విమానం ఎత్తు కోల్పోయిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని, తన సోదరుడు పలుమార్లు విమానం పైకప్పును ఢీకొన్నాడని ప్రయాణికుడు చెప్పాడు. పలువురు ప్రయాణికులు గాయపడి రక్తస్రావంతో సహాయం కోసం కేకలు వేశారని పేర్కొన్నారు.

కెప్టెన్‌ డోపింగ్‌ పరీక్షలో విఫలమయ్యారా?

ఘటన అనంతరం ఇద్దరు పైలట్లకు నిబంధనల ప్రకారం సైకోయాక్టివ్‌ పదార్థాల పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఫస్ట్‌ ఆఫీసర్‌ పరీక్ష ఫలితం క్లియర్‌గా రాగా, కెప్టెన్‌ రెండు పరీక్షల్లో విఫలమయ్యారని, రెండో పరీక్షలో గంజాయి వినియోగం గుర్తించినట్లు వర్గాలు తెలిపినట్లు ఫైల్‌లో పేర్కొన్నారు. ఇద్దరు పైలట్లను డ్యూటీ నుంచి తొలగించినట్లు కూడా సమాచారం. అయితే తుది కారణాలపై అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ అంశంపై తుది నిర్ధారణకు రావాల్సి ఉంది.

ఏఏఐబీ దర్యాప్తు

ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (AAIB) దర్యాప్తు చేపట్టింది. విమానం, దాని వ్యవస్థలు, ఫ్లైట్‌ డేటా, నిర్వహణ రికార్డులు, వైద్య సమాచారం, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎలాంటి తుది నిర్ధారణకు రాకముందు అన్ని ఆధారాలను పూర్తిగా పరిశీలిస్తామని స్పష్టం చేసింది. విమానం చివరకు ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. అయితే 300 అడుగుల ఎత్తు కోల్పోవడానికి అసలు కారణం, హైడ్రాలిక్‌ వ్యవస్థల పాత్ర, పైలట్ల నిర్ణయాలు, ప్రయాణికుడు చేసిన ఆరోపణల నిజానిజాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Follow Us