Telangana: అధిక లాభాల కోసం భారీ పెట్టుబడి పెడుతున్నారా.. ఒక్క క్షణం ఆగండి.!
విదేశీ కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో కోట్లు దండుకుంటున్న ముఠాను పట్టుకున్నారు సైబర్ క్రైం పోలీసులు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఏకంగా 66 లక్షలు కొల్లగొట్టారు కేటుగాళ్లు. ఈ ముఠా ఆటకట్టించింది హైదరాబద్ సైబర్ క్రైమ్ టీమ్.
![Telangana: అధిక లాభాల కోసం భారీ పెట్టుబడి పెడుతున్నారా.. ఒక్క క్షణం ఆగండి.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/03/fake-trading-company.jpg?w=1280)
విదేశీ కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో కోట్లు దండుకుంటున్న ముఠాను పట్టుకున్నారు సైబర్ క్రైం పోలీసులు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఏకంగా 66 లక్షలు కొల్లగొట్టారు కేటుగాళ్లు. ఈ ముఠా ఆటకట్టించింది హైదరాబద్ సైబర్ క్రైమ్ టీమ్. సౌతాఫ్రికా కేంద్రంగా నడుస్తున్న అంతర్జాతీయ కంపెనీ ఉకుచుమా ఫైనాన్షియల్ సర్వీసెస్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి టెలిగ్రామ్ యాప్లో లింక్ పంపారు కేటుగాళ్లు. ఎక్స్ప్రో మార్కెట్స్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా.. ఉకుచుమా ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేశాడు హైదరాబాద్కు చెందిన వ్యక్తి. తొలుత బాధితుడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కు మంచి ప్రాఫిట్స్ కలిపి.. డబ్బులు జమ చేశారు. దీంతో పెద్దమొత్తంలో లాభాలు వస్తున్నాయని.. పలు దఫాల్లో 66 లక్షల 56 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు సదరు బాధితుడు.
కొన్ని నెలలుగా ప్రాఫిట్స్ కాదు కదా.. ఉన్న డబ్బుల జాడ కూడా లేకపోవడంతో కంగుతిన్నాడు బాధితుడు. ఎక్స్ప్రో మార్కెట్స్, ఉకుచుమా సర్వీసెస్కు కాల్స్, మెసేజ్లు చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో చివరికి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. అతడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం.. అహ్మదాబాద్కు చెందిన ఇద్దరు కేటుగాళ్లను అదుపులోకి తీసుకుంది. వారు అహ్మదాబాద్లోని అంబవాడికి చెందిన థాకూర్ కుల్దీప్ అరవింద్ కుమార్, గుజరాత్కు చెందిన వఘేలా రుతురాజ్ ఘన్శ్యామ్గా గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితులపై దేశవ్యాప్తంగా 5 కేసులు ఉండగా.. తెలంగాణ నుంచి 2 కేసులు నమోదైనట్లు గుర్తించారు. దాదాపు 4 కోట్ల రూపాయల మేర కాజేసినట్లు పోలీసులు తేల్చారు. కాగా, అధిక లాభాలు వస్తాయని పెట్టుబడులు పెట్టేవారు పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాతనే తమ వ్యక్తిగత విషయాలు, బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయాలని లేకపోతే.. ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ అప్రమత్తతో వ్యవహరించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.