Hyderabad: మైలార్దేవ్పల్లి డబుల్ మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు.. సైకో కిల్లర్ పనే
మైలార్దేవ్ పల్లిలో తీవ్ర కలకలం రేపిన వరుస హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా కిల్లర్ను పట్టుకున్నారు.

వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలు చేసి హైదరాబాద్ వాసులను వణికించిన సైకో కిల్లర్ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరుస హత్యల కేసును అత్యంత వేగంగా ఛేదించి సీరియల్ కిల్లర్ను అరెస్ట్ చేశారు. ఇంకా ఇలా ఎవరినైనా హతమార్చాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బుధవారం రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్ పై జరిగిన డబుల్ మర్డర్ స్టానికంగా టెన్షన్ రేపింది. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో రెండు హత్యలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బ్లాంకెట్లు అమ్ముకునే వ్యక్తిని, రోడ్డు పక్కన షాప్ ముందు నిద్రిస్తున్న మరో వ్యక్తిని గ్రానైట్ రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. ఈ హత్యలు జరిగిన 12 గంటల్లోనే హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈ సీరియల్ కిల్లర్ హైదరాబాద్లోని నేతాజీ నగర్, దుర్గానగర్ చౌరస్తా, కాటేదాన్ ప్రాంతాల్లో తిరుగుతూ… వరుస హత్యలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. రోడ్డు పక్కన పడుకుంటున్నవారే లక్ష్యంగా హతమారుస్తున్నట్లు గుర్తించారు. బుధవారం ఇద్దరిని హత్య చేసిన నిందితుడు… ఈ నెల 7వ తేదీన రోడ్డు పక్కన నిద్రిస్తున్న మరో వ్యక్తిని దారుణంగా హతమార్చినట్లు విచారణలో తేలింది.
ముఖ్యంగా గంజాయికు అలవాటు పడిన వారు ఈ తరహా హత్యలు చేస్తారని.. నిందితుడి గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
