ముంబై టూ హైదరాబాద్.. వయా గోవా.. మధ్యలో అనుమానాస్పద వ్యక్తి.. కట్ చేస్తే.. ఖతర్నాక్ స్టోరీ..
ముంబై టూ హైదరాబాద్.. వయా గోవా.. దిమ్మతిరిగే ఖతర్నాక్ స్టోరీ ఇది.. మధ్యలో ఓ అనుమానాస్పద వ్యక్తి.. అసలు ఆ వ్యక్తి ఏం చేశాడు.. ఈ స్టోరీతో సంబంధం ఏంటి.? అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. మీకూ మైండ్ బ్లాంక్ కావడం పక్కా.. లేట్ ఎందుకు మరి.!

హైదరాబాద్లోని భారీ డ్రగ్స్ రాకెట్టు గుట్టురట్టు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఎర్రమంజిల్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. పంజాగుట్ట పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కలిసి సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్లో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్తుడు స్టాండ్లీ ఉడొక.. నిందితుడి నుంచి 557 గ్రాముల కొకైన్, 21 గ్రాముల హెరాయిన్, 105 బోల్ట్స్ LSD, గంజాయితో పాటు మరికొన్ని డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసుల అంచనా. 2009వ సంవత్సరం నవంబర్లో బిజినెస్ వీసాపై హైదరాబాద్ వచ్చిన స్టాండ్లీ.. మొదట్లో క్లాత్ బిజినెస్ చేశాడు. కోవిడ్ సమయంలో క్లాత్ బిజినెస్ సరిగ్గా నడవకపోవడంతో.. పూర్తిస్థాయిలో డ్రగ్స్ పెడ్లర్గా మారాడు. నైజీరియన్లతో పరిచయం ఉండటంతో డ్రగ్స్ దందా యద్దేచ్చగా కొనసాగించాడు. కొరియర్ ద్వారా ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకుని పెడ్లింగ్ చేయడం మొదలుపెట్టాడు.
ఎర్రమంజిల్, పంజాగుట్ట సమీపంలో యద్దేచ్చగా డ్రగ్స్ దందా సాగుతోందని పంజాగుట్ట పోలీసులకు పక్కా సమాచారం అందటంతో.. ఆ ఏరియాల్లో రెక్కి నిర్వహించిన ఖాకీలు.. చాకచక్యంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. 2017లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నమోదు చేసిన డ్రగ్స్ కేసులో కూడా గతంలో స్టాండ్లీ అరెస్ట్ అయినట్టు గుర్తించారు పోలీసులు. నిందితుడి డ్రగ్స్ లిస్టులో 500 మంది వినియోగదారులు ఉన్నట్టుగా.. అందులో 7 మంది హైదరాబాద్కు చెందినవారిగా గుర్తించారు. కాగా, వీసా గడువు ముగిసినా.. ఇంకా ఇండియాలోనే ఉండటంతో నిందితుడ్ని ఆర్నెళ్లు జైలుకు పంపించారు పోలీసులు.




