అబ్బ.. ఎంత చల్లని కబురో.. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, తెలంగాణలోనూ మరో ఒకటి రెండు రోజుల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవడంతోపాటు, ఉష్ణోగ్రతల తగ్గుదల నమోదయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి.. ఈ సమయంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే.. రుతుపవనాలు ఏపీనికి తాకగా.. తెలంగాణలో నేడో, రేపో నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని పేర్కొంది.. దీని ప్రభావంతో వర్షాలు కురవడంతోపాటు.. ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం.. శనివారం(జూన్ 6) నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లోని కొన్నిప్రాంతాలు తాకినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రానున్న 2-3 రోజులు రాష్ట్రంలో మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో కురిసే మొత్తం వర్షపాతం సాధారణ స్థాయి కంటే కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అయితే, స్థానిక వాతావరణ మార్పుల (Local Weather Effects) వల్ల కురిసే వర్షాలు ఈ లోటును కొంత మేరకు భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. కాకపోతే, ఈసారి రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు (Monsoon Breaks) ఏర్పడే అవకాశం ఉందన్నారు. అంటే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి,మరికొన్ని రోజుల పాటు వాతావరణం పొడిగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. రైతులు ఈ మార్పులను గమనించి, తదనుగుణంగా తమ పంట ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.
నైరుతి రుతుపవనాల సీజన్లో (జూన్-సెప్టెంబర్ 2026) ఆంధ్రప్రదేశ్ లో వర్షపాతం సూచనలు క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
సాధారణం కంటే తక్కువ వర్షపాతం:
ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో ముఖ్యంగా పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురము, వైఎస్ఆర్ కడప, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం: ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
సాధారణ వర్షపాతం: శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు.
ఆదివారం, సోమవారం వర్షాలు
ఆదివారం, సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం (07-06-2026) పల్నాడు, మార్కాపురం, కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు రేపు శ్రీకాకుళం జిల్లాలో 12 మండలాలు, విజయనగరం 22, మన్యం 12, అల్లూరి1, పోలవరం 2, విశాఖ 1,కాకినాడ 8 మొత్తంగా 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణకు వాతావరణశాఖ చల్లటి కబురు
తెలంగాణకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆదివారం కానీ.. సోమవారం కానీ.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి.. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.. తేలికపాటి వర్షాలతో వాతావరణం చల్లబడింది.. ఈ క్రమంలో రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
