Telangana: ఓట్ల పండుగలో నోట్ల జాతర.! దొరికింది కొండంతైతే.. అక్రమం గోరంతే.. లెక్కల్లో నిజమెంత.?
తెలంగాణ దంగల్లో నగదు, నగలు అడ్డగోలుగా ప్రవహిస్తున్నాయి. డైలీ భారీగా క్యాష్, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు సీజ్ చేస్తున్నారు అధికారులు. అయితే ఇప్పటిదాకా సీజ్ చేసిందెంత? 340 కోట్లా? లేక కోటి 76 లక్షలేనా? అంత పట్టుబడితే ఇంత చూపించడం ఏంటి? దీనిపై ఈసీ ఏమంటోంది? దానికి ఐటీ ఏం క్లారిటీ ఇస్తోంది?
హైదరాబాద్, అక్టోబర్ 26: తెలంగాణ దంగల్లో నగదు, నగలు అడ్డగోలుగా ప్రవహిస్తున్నాయి. డైలీ భారీగా క్యాష్, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు సీజ్ చేస్తున్నారు అధికారులు. అయితే ఇప్పటిదాకా సీజ్ చేసిందెంత? 340 కోట్లా? లేక కోటి 76 లక్షలేనా? అంత పట్టుబడితే ఇంత చూపించడం ఏంటి? దీనిపై ఈసీ ఏమంటోంది? దానికి ఐటీ ఏం క్లారిటీ ఇస్తోంది? పట్టుబడ్డ కొండంత సొమ్ములో అక్రమం గోరంతేనా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా.!
తెలంగాణలో ఎన్నికల కోడ్ కూశాక….డైలీ భారీగా నగదు, నగలు, వెండి వస్తువులు పట్టుబడుతున్నాయి. ఇప్పటివరకు 340 కోట్ల రూపాయల విలువైన నగదు, నగలు సీజ్ చేశామంటున్నారు పోలీసులు. దీనిలో 119 కోట్ల 44 లక్షల రూపాయల నగదు ఉంటే, 156 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక 18 కోట్ల 67 లక్షల రూపాయల విలువైన మద్యం కూడా సీజ్ అయింది. 16కోట్ల 94 లక్షల రూపాయల విలువైన మత్తుపదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఇప్పటివరకు తాము సీజ్ చేసిన నగదు, నగలు.. అన్నీ కలిపి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు పోలీసులు. వాళ్ల రిపోర్ట్లో ఇప్పటిదాకా పట్టుబడింది ఇంత అయితే…ఇందులో కేవలం 1.76 కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రమే ఎలాంటి వివరణ అందలేదంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్. పోలీసులకు పట్టుబడింది వందల కోట్లలో ఉంటే.. ఐటీ కేవలం 1.76 కోట్లకు మాత్రమే వివరణ లేదు.. మిగతా సొమ్ము ఓకే అనడంతో కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు పట్టుబడిందెంత? అందులో సక్రమ సొమ్మెంత? అక్రమంగా ఓటుకు నోటు కోసం తరలిస్తోందెంత అనే దానిపై గందరగోళం నెలకొంది.
ఎన్నికల వేళ తెలంగాణలోని 33 జిల్లాలలో ఐటీకి చెందిన క్విక్ రియాక్షన్ టీమ్స్ 24 గంటలు పని చేస్తున్నాయి. తెలంగాణలో పట్టుబడుతున్న నగదు మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకే చేరుతుంది. ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 132 ప్రకారం ఐటీ అధికారులు అక్రమంగా తరలిస్తున్న డబ్బును నేరుగా సీజ్ చేయవచ్చు. ఐటీ యాక్ట్ సెక్షన్ 132(ఏ) ప్రకారం పోలీసులు లేదా ఇతర ఏజెన్సీల నుంచి వచ్చిన నగదును ఐటీ సీజ్ చేస్తుంది. పోలీసులకు తనిఖీల్లో దొరికిన నగదు, నగలను ఇన్కమ్ టాక్స్ అధికారులకు అందజేస్తారు. ఆ తర్వాత సంబంధిత వ్యక్తిని ఐటీ శాఖ విచారణకు పిలుస్తుంది. ఐటీ అధికారులు పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత ఆ నగదు అక్రమం అని తేలితే దాన్ని సీజ్ చేస్తారు. అలా ఇప్పటివరకు పోలీసులు సీజ్ చేసి ఐటీ వద్దకు చేరిన నగదు వందల కోట్లలో ఉన్నా.. ఎలాంటి వివరణ లేని నగదు మాత్రం తక్కువే అంటున్నారు ఐటీ అధికారులు.
మరోవైపు దొరికిన సొత్తు విలువ పది లక్షల విలువ దాటితేనే ఐటీ శాఖకు పోలీసులు అందజేస్తారు. అందుకే పట్టుబడింది కొండంత ఉన్నా.. అక్రమ సొమ్ము గోరంతే అంటున్నారు అధికారులు. కేవలం హైప్ కోసమే పోలీసులు తనిఖీలు చేసి, పట్టుబడ్డ సొత్తుపై ప్రకటనలు చేస్తున్నారా? అందుకే ఈసీ చెబుతున్న లెక్కలకు ఐటీ చెప్పే లెక్కలకు తేడా ఉందంటున్నారు.