AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చంచల్‌గూడ-సంతోష్‌నగర్ ఫ్లైఓవర్‌కు పేరు ఎవరిది? నాలుగు పేర్లతో ‘నేమ్ వార్’

హైదరాబాద్‌లో సుదీర్ఘకాలంగా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న సైదాబాద్, చంచల్‌గూడ, సంతోష్‌నగర్ ప్రాంతాల ప్రజలకు భారీ ఊరట కలిగించే స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు నిర్మించిన ఈ కీలక వంతెనను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తికావడంతో ఇప్పుడు మరో అంశం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. అదే ఈ వంతెనకు ఏ పేరు పెట్టాలన్నది..!

Hyderabad: చంచల్‌గూడ-సంతోష్‌నగర్ ఫ్లైఓవర్‌కు పేరు ఎవరిది? నాలుగు పేర్లతో ‘నేమ్ వార్’
Chanchalguda Santoshnagar Flyover
Balaraju Goud
|

Updated on: Aug 14, 2026 | 3:11 PM

Share

హైదరాబాద్‌లో సుదీర్ఘకాలంగా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న సైదాబాద్, చంచల్‌గూడ, సంతోష్‌నగర్ ప్రాంతాల ప్రజలకు భారీ ఊరట కలిగించే స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు నిర్మించిన ఈ కీలక వంతెనను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తికావడంతో ఇప్పుడు మరో అంశం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. అదే ఈ వంతెనకు ఏ పేరు పెట్టాలన్నది..!

ఫ్లైఓవర్‌కు పేరు ఒక్కటే పెట్టాల్సి ఉండగా.. ఇప్పటికే నాలుగు పేర్లు తెరపైకి వచ్చాయి. బీజేపీ ఒక పేరు ప్రతిపాదిస్తే.. ఎంఐఎం మరో పేరు సూచిస్తోంది. కాంగ్రెస్ వర్గాలు ఇంకో పేరును కోరుతుండగా.. బీఆర్ఎస్ కూడా తన ప్రతిపాదనతో రంగంలోకి దిగింది. స్థానిక సంఘాలు సైతం తమ డిమాండ్లను వినిపిస్తున్నాయి. దీంతో చివరకు నేమ్ ప్లేట్‌పై ఎవరి పేరు కనిపించబోతుందన్న ఆసక్తి నెలకొంది.

రూ.620 కోట్లతో భారీ ఫ్లైఓవర్

చంచల్‌గూడ జైలు ప్రాంతం నుంచి ప్రారంభమయ్యే ఈ నాలుగు లేన్ల బైడైరెక్షనల్ స్టీల్ ఫ్లైఓవర్ సంతోష్‌నగర్‌లోని యాదగిరి థియేటర్ వరకు విస్తరించింది. సుమారు 2.5 నుంచి 2.58 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.620 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. సైదాబాద్ వద్ద అప్‌రాంప్, ఐఎస్ సదన్ వద్ద డౌన్‌రాంప్ ఏర్పాటు చేశారు.

ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే చంచల్‌గూడ, సైదాబాద్, సంతోష్‌నగర్, చంపాపేట, మలక్‌పేట, కర్మన్‌ఘాట్ ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. పీక్ అవర్స్‌లో ప్రస్తుతం 30 నుంచి 45 నిమిషాల వరకు పడుతున్న ప్రయాణ సమయం సుమారు ఎనిమిది నిమిషాలకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రోజుకు 1.5 లక్షలకు పైగా వాహనాలు ఈ మార్గాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని అంచనా.

2020లో శంకుస్థాపన.. ఎన్నో అడ్డంకులు

ఈ ప్రాజెక్టుకు 2020లోనే శంకుస్థాపన జరిగింది. రెండేళ్లలో పూర్తి చేయాలని అప్పట్లో లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. కోవిడ్ మహమ్మారి, భూసేకరణ సమస్యలు, కోర్టు కేసులు, మతపరమైన నిర్మాణాలకు సంబంధించిన అంశాలతో పనులు ఆలస్యమయ్యాయి. గత ఏడాది నుంచి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం పనులు పూర్తవడంతో ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది.

బీజేపీ ప్రతిపాదన.. సంగం లక్ష్మీబాయి

ఫ్లైఓవర్ పేరు విషయంలో తొలుత భారతీయ జనత పార్టీ నుంచి బలమైన డిమాండ్ వినిపించింది. స్వాతంత్ర్య సమరయోధురాలు, ప్రజాప్రతినిధి సంగం లక్ష్మీబాయి పేరును ఈ వంతెనకు పెట్టాలని బీజేపీ నాయకులు ప్రతిపాదించారు. ఆమె సేవలను గుర్తిస్తూ ఈ పేరు పెట్టాలని బీజేపీ వర్గాలు కోరుతున్నాయి. తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ కూడా సంగం లక్ష్మీబాయి పేరుకే మద్దతు ప్రకటించింది.

ఎంఐఎం డిమాండ్.. ఏపీజే అబ్దుల్ కలాం

మరోవైపు ఎంఐఎం నేతలు మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదిస్తున్నారు. దేశానికి శాస్త్రవేత్తగా సేవలందించిన కలాం పేరు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని వారు వాదిస్తున్నారు. యువతకు స్ఫూర్తిగా నిలిచిన కలాం పేరు పెట్టడం సముచితమని ఎంఐఎం నేతలు కోరుతున్నారు.

కాంగ్రెస్ నుంచి సుధీర్ కుమార్ పేరు

ఇక కాంగ్రెస్ వర్గాలు సుధీర్ కుమార్ పేరును ప్రతిపాదిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు రెండు పేర్ల చుట్టూ సాగిన చర్చ మూడు పేర్ల పోటీగా మారింది. అధికార పార్టీకి చెందిన వర్గాల నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రంగంలోకి బీఆర్ఎస్.. సింగిరెడ్డి పేరుతో..

తాజాగా బీఆర్ఎస్ కూడా ఈ పేరు పంచాయతీలోకి ఎంట్రీ ఇచ్చింది. సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేరును ఫ్లైఓవర్‌కు పెట్టాలని బీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు. దీంతో నాలుగు ప్రధాన రాజకీయ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. సంగం లక్ష్మీబాయి, ఏపీజే అబ్దుల్ కలాం, సుధీర్ కుమార్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ఇప్పుడు చర్చలో ఉన్నాయి.

చివరకు నేమ్ ప్లేట్‌పై ఎవరి పేరు?

ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం దగ్గరపడుతున్న కొద్దీ పేరు వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారుతోంది. అయితే ఇప్పటివరకు ఏ పేరును ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లన్నీ రాజకీయ పార్టీలు, స్థానిక సంఘాలు చేస్తున్న ప్రతిపాదనలు, డిమాండ్లుగానే చూడాలి. చివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే అసలు ప్రశ్న. చారిత్రక సేవలు చేసిన వ్యక్తి పేరును ఎంపిక చేస్తారా? అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పేరును ఖరారు చేస్తారా? స్థానికంగా సేవలందించిన వ్యక్తికి అవకాశం ఇస్తారా? లేక ప్రభుత్వం అనూహ్యంగా మరో పేరును ప్రకటిస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.

ఒకవైపు ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు దాని నేమ్ ప్లేట్‌పై ఎవరి పేరు ఉంటుందన్న ‘నేమ్ వార్’ రాజకీయ వేడి పెంచుతోంది. అధికారిక ప్రారంభ తేదీతో పాటు ఫ్లైఓవర్ పేరును కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉండటంతో.. చివరకు ఎవరి పేరు ఖరారవుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us