Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. బిగ్ అప్డేట్ వచ్చేసింది..
హైదరాబాద్లో ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ బస్సులు సర్వీసులు అందిస్తున్నాయి. అయితే త్వరలో మరికొన్ని బస్సులు రోడ్లపైకి రానున్నాయి. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలోనే 60 బస్సులను తిప్పేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. దీని వల్ల నగరంలో కాలుష్యం తగ్గనుంది.

హైదరాబాద్ వాసులకు టీజీఎస్ఆర్టీసీ భారీ శుభవార్త అందించింది. నగరంలో త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రెడ్డెక్కేందుకు సర్వం సిద్దమైంది. ఏకంగా 60 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ ఒకేసారి నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని వివిధ రూట్లలో వీటిని ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది. డీజిల్ బస్సుల్లోని ఇంజిన్లను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్లను ఆమర్చనున్నారు. దీంతో వాటిని ఎలక్ట్రిక్ బస్సుల తరహాలో వినియోగించనున్నారు.
డీజిల్ బస్సుల స్ధానంలో ఎలక్ట్రిక్ వాహనాలు
అయితే డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలంటే ఖర్చుతో కూడుకున్న పని. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్ధలతో ఇటీవల టీజీఎస్ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆ సంస్థ తమ నిధులతో ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి ఆర్టీసీకి అందించనుంది. ఆ తర్వాత విడతల వారీగా ఆ సంస్థకు ఆర్టీసీ చెల్లించనుంది. వడ్డీతో సహా ఆ సంస్థకు చెల్లించేందుకు డీల్ కుదుర్చుకుంది. ఒకేసారి అన్నీ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆర్టీసీ దగ్గర అంత నిధులు ఒకేసారి ఉండవు. దీంతో ప్రైవేట్ సంస్ధలకు ఆ బాధ్యతలను అప్పగిస్తోంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో 3200 వరకు బస్సులు ఉన్నాయి. వీటిల్లో వెయ్యి బస్సులు కాలం చెల్లినవే ఉన్నాయి. దీంతో కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో 440 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. రానున్న రోజులలో డీజిల్ బస్సులను తగ్గించి మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
2 వేల బస్సులకు ఆర్డర్
ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-బస్ సేవా పథకం కింద హైదరాబాద్కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. ఈ బస్సుల కొనుగోలుకు ప్రైవేట్ సంస్థకు టీజీఎస్ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. అద్దె ప్రతిపాదినక వీటిని తీసుకోనున్నారు. ప్రస్తుతం వీటిని తీసుకునేందుకు ఆర్డర్ ఇవ్వగా.. త్వరలోనే ఆర్టీసీకి అందనున్నాయి. దీంతో ఈ ఏడాదిలో భారీగా ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఈ చర్య ఉపయోగపడనుంది. భవిష్యత్తులో నగరంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తిరిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు. నగరంలో డీజిల్ బస్సులు అనేవి నగరంలో కనిపించకుండా చేయనున్నారు.
