CP Sajjanar: వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
సైబర్ నేరగాళ్లు కేవలం బాధితుల బ్యాంకు ఖాతాలను మాత్రమే ఖాళీ చేయడం లేదని, వారి భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని, చివరికి మనశ్శాంతిని కూడా హైజాక్ చేస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరాల వల్ల కలిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటోందంటే, ఆ బాధ నుండి కోలుకోవడానికి బాధితులకు జీవితకాలం కూడా సరిపోవడం లేదని ఆయన పేర్కొన్నారు. దయచేసి యువత సైబర్ ఉచ్చులో చిక్కుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.

శనివారం నాడు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఎస్ఆర్ శ్లోక కన్వెన్షన్లో ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజల్లో చైతన్యం రావడం అత్యవసరమని, ముఖ్యంగా విద్యావంతులే లక్ష్యంగా నకిలీ సెబీ సర్టిఫికేట్లు చూపిస్తూ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో రోజుకు సుమారు రూ. 1 కోటి వరకు ప్రజలు ఇలాంటి మోసాల వల్ల నష్టపోతున్నారని గణాంకాలతో సహా వివరించారు సీపీ. బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులను సాకుగా చూపి అపరిచితులు చేసే ట్రేడింగ్ ప్రతిపాదనలను నమ్మవద్దని కోరారు.
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత చిత్రాలను, సమాచారాన్ని పంచుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తులు పంపే హానికరమైన ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. ఇటీవల కాలంలో నకిలీ పోలీసుల పేరుతో ‘డిజిటల్ అరెస్ట్’ అంటూ వీడియో కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామనే అపరిచిత లోన్ యాప్స్ పట్ల కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు
ఎవరైనా దురదృష్టవశాత్తూ సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘గోల్డెన్ అవర్’లో 1930 నంబర్కు కాల్ చేయాలని, తద్వారా పోగొట్టుకున్న సొమ్మును నేరగాళ్ల ఖాతాల్లో ఫ్రీజ్ చేసి వెనక్కి రప్పించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
