Telangana: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సిటీ సివిల్ కోర్టులో ఊరట.. ఢిల్లీ బీజేపీ నేతలకు నోటీసులు
బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. MLC కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఆదేశించింది.

MLC కల్వకుంట్ల కవిత(kalvakuntla kavitha)కు సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు. బీజేపీ నేతలు తన పరువు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె కోర్టును ఆశ్రయించింది. ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని పిటిషన్ ఆమె పేర్కొంది. ప్రజల్లో తనకున్న ప్రతిష్టను భంగం కలిగించేందుకు ఆక్రమ పద్ధతులను ఎంచుకున్నారని వివరించింది. ఆరోపణలు చేసిన వ్యక్తులు జాతీయ పార్టీ సభ్యులు కావడంతోనే మీడియాలో కథనాలు వచ్చాయని ఆమె న్యాయస్థానానికి వివరించింది. ఈమేరకు పలు మీడియా చానల్స్లో వచ్చిన వరుస కథనాలను కోర్టుకు సమర్పించారు కవిత తరుఫు న్యాయవాది. ఆగస్టు 21 తేదీన మీడియా సమావేశంలో బీజేపీ నేతలు మాట్లాడిన వీడియోలను సైతం కోర్టు ముందు ఉంచారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కవిత పేరును కేసులో ఎక్కడా ఎవరూ వాడొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ప్రతివాదులైన బీజేపీ ఎంపీ పర్వేశ్ శర్మ(BJP MP Parvesh Verma), మాజీ ఎమ్మెల్యే మంజింధర్ సింగ్కు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి MLC కవిత పేరు ఎక్కడ వాడొద్దని పేర్కొంది. సభలు, మీడియా, సోషల్ మీడియాలో ఆమె పేరు వినియోగించవద్దని, నిరాధార ఆరోపణలు చేయవద్దని వారికి సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13 కు వాయిదా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..
