మీ బైక్ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు.. టూ వీలర్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడంటే..
ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు ముగ్గురు బాల నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.నిందితుల వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో యమహా, యాక్టివా, డియో, పల్సర్ బైకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు జప్టో డెలివరీ బాయ్స్గా పని చేస్తూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చోరీల బాట పట్టారు.

హైదరాబాద్లోని కూకట్పల్లి, మేడ్చల్-మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు పోగొట్టుకున్న వాహనదారులకు ఒక కీలకమైన వార్త. గత కొంతకాలంగా నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఒక అంతర్-జిల్లా వాహన దొంగల ముఠాను బాచుపల్లి పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా అరెస్టుతో పలు బైక్ దొంగతనం కేసుల మిస్టరీ వీడింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన వాహనాలలో యమహా (Yamaha), హోండా యాక్టివా (Activa), డియో (Dio), బజాజ్ పల్సర్ (Pulsar) వంటి పాపులర్ మోడల్ బైకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల నేపథ్యం గురించి విచారించగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. వీరంతా ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ యాప్ జెప్టో (Zepto) లో డెలివరీ బాయ్స్గా పని చేస్తున్నారు. నిత్యం కాలనీల్లో తిరిగే వీరు, తాళం వేయకుండా నిర్లక్ష్యంగా ఉంచిన లేదా పాత తాళాలు ఉన్న బైకులను టార్గెట్ చేసేవారు. కేవలం విలాసాలకు, మద్యం సేవించడానికి, ఇతర చెడు అలవాట్లకు బానిసలై, వాటి ఖర్చుల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ డెలివరీ బాయ్స్ దొంగలుగా మారారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ ముఠా కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని బాచుపల్లి, పేట్ బషీరాబాద్, దుండిగల్, జీడిమెట్ల, ఆల్వాల్, కూకట్పల్లి, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు కుత్బుల్లాపూర్ ఏసీపీ (ACP) మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ప్రాంతాల్లో బైకులు పోగొట్టుకున్న బాధితులు బాచుపల్లి పోలీసులను సంప్రదించి, స్వాధీనం చేసుకున్న వాహనాల ఇంజన్ నంబర్, చేస్సిస్ నంబర్ ఆధారంగా తమ వాహనాలను గుర్తుపట్టవచ్చని పోలీసులు సూచించారు.




