Hyderabad: గ్యాస్ దొరకడం లేదని ఆటో డ్రైవర్ల నిరసన.. సెల్ టవర్ ఎక్కి మరీ..
గ్యాస్ దొరడకం లేదని ఆటో డ్రైవర్లు వినూత్న నిరసన చేపట్టారు. సెల్ టవర్ ఎక్కి ఆందోళనలు చేపట్టారు. హైదరాబాద్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎల్పీజీ ఆటో గ్యాస్ దొరకడం లేదని డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

హైదరాబాద్లో గ్యాస్ కొరతపై ఆటో డ్రైవర్ల నిరసన తీవ్రరూపం ధరించింది. అత్తాపూర్ ప్రాంతంలో ముగ్గురు డ్రైవర్లు ఆటో ఎల్పీజీ దొరకట్లేదని ఏకంగా సెల్ టవర్పై ఎక్కి తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ శివరాంపల్లి సబ్స్టేషన్ వద్ద పిల్లర్ నంబర్ 291 దగ్గర ఆటో డ్రైవర్లు రోడ్డుపై కూర్చుని నిరసన చేశారు. నాగోల్కు చెందిన సాయి, అబ్దుల్తో పాటు మరొకరు బంకుల్లో ఎల్పిజి ఆటో గ్యాస్ దొరకట్లేదని సెల్ టవర్పై ఎక్కారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గంటల తరబడి లైన్లో నిలబడినా రూ.500 విలువైన గ్యాస్ మాత్రమే ఇస్తున్నారని, అది తమ రోజువారీ పనికి సరిపోవడం లేదని డ్రైవర్లు ఆక్రోశం వ్యక్తం చేశారు.
డీసీపీపై ఆగ్రహావేశాలు
హైదరాబాద్లో ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ కొరత తీవ్రమవుతోంది, మధ్యప్రాచ్య ప్రాంతంలో ఘర్షణల వల్ల సరఫరాకి అంతరాయం ఎర్పడింది. ఆటో డ్రైవర్లు, హోటళ్లు, గృహాలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ బంకుల వద్ద పెద్ద లైన్లు, కొన్ని చోట్ల ఆటో ఎల్పీజీ ధరలు రూ.60 నుంచి రూ.100కి పెరిగాయని ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, టవర్పై ఎక్కిన డ్రైవర్లను నచ్చజెప్పి కిందికి దించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. మరోపక్క నిరసన తెలుపుతున్న టైంలో అటువైపు నుంచి వెళుతున్న ఆటో డ్రైవర్ పై నిరసన చేస్తున్న ఆటో డ్రైవర్లు దాడి చేశారు. ఆటో ప్రెసిడెంట్ యూనియన్ అని పేరు చెప్పి నిరసనకు మద్దతు తెలుపకుండా ఆటో నడుపుతున్నాడని ఆటో డ్రైవర్ పై దాడి చేశారు కొందరు ఆటో డ్రైవర్లు. మరోపక్క పరిస్థితిని చక్కదిద్దేందుకు స్థానిక డిసిపి అక్కడికి రాగా.. ఆటో డ్రైవర్లు డిసిపిపై ఆవేశంతో తిరగబడ్డారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. గుమ్మి కూడిన జనాన్ని చెదరగొట్టారు.
