Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు మరో లేఖ.. ప్రస్తావించిన అంశాలివే..!
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ కు వరుసగా బహిరంగ లేఖలను సంధిస్తున్నారు. ఇప్పటికే టెట్, రుణమాఫీ, ఇతర అంశాలపై సీఎం ను ప్రశ్నించిన హరీశ్ రావు మరో బహిరంగ లేఖను వదిలారు. అయితే ఈసారి పొద్దు తిరుగుడు పంట మద్దతు ధర గురించి కీలక విషయాలను ప్రస్తావిస్తూ లేఖను రాశారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ కు వరుసగా బహిరంగ లేఖలను సంధిస్తున్నారు. ఇప్పటికే టెట్, రుణమాఫీ, ఇతర అంశాలపై సీఎం ను ప్రశ్నించిన హరీశ్ రావు మరో బహిరంగ లేఖను వదిలారు. అయితే ఈసారి పొద్దు తిరుగుడు పంట మద్దతు ధర గురించి కీలక విషయాలను ప్రస్తావిస్తూ లేఖను రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దు తిరుగుడు పువ్వు (sun flower) పంట పండించారని, ఈ పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని హరీశ రావు మండిపడ్డారు.
అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించి మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పువ్వు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే దాని ప్రకారమే మార్కెట్లలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయకుండా, కేవలం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారని హరీశ్ రావు మండిపడ్డారు. మిగతా పంటను ప్రస్తుతం కొనుగోలు చేయడం లేదని. దీంతో 75 శాతం పంటను రైతులు చాలా తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తుందని లేఖలో ప్రస్తావించారు.
రాష్ట్రంలో 1,65,800 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంట దిగుబడి వస్తుదని, ఇందులో కేంద్ర ప్రభుత్వం తన నిధులతో కేవలం 37,300 క్వింటాళ్లు మాత్రమే కొనడానికి అంగీకరించిందని హరీశ్ రావు అన్నారు. ఈ సారి కూడా రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు.
ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు కేవలం నాలుగైదు వేలకే తమ పంట అమ్ముకుని నష్టపోవాల్సి వస్తుందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జోక్యం చేసుకుని పొద్దు తిరుగుడు పువ్వు పంటను మొత్తం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసి, రైతులు ఆదుకోవాలని హరీశ్ రావు లేఖ లో డిమాండ్ చేశారు.