
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈనెల 26న రైతు బంధు నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆరోజు నుంచే అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ నిధులు జమ చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. కాగా రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తొలకరి జల్లులు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వానకాలం పెట్టుబడి కింద రైతు బంధు నిధులు జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు కూడా రైతు బంధు వర్తించేలా చూడాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే రుతుపవనాలు ఆలస్యం అవుతున్న కారణంగా..రాష్ట్ర రైతాంగానికి వానాకాలం పంట సాగునీటి సరఫరాపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
కాగా రైతు బంధు సాయం కింద ఎకరాకు రూ. 5 వేల చొప్పున అందిస్తున్నారు. ఈ పథకం కింద గత ఖరీఫ్ సీజన్లో 63 లక్షల మంది అన్నదాతలకు రూ. 7,400 కోట్లు అందజేశారు. ఇక తాజా సీజన్లో దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 7,500 కోట్లు అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..