Parliament Elections: ఈ పార్లమెంట్ స్థానాల్లో కీలకంగా మారనున్న పసుపు బోర్డు ఏర్పాటు..
పసుపు సీజన్ మొదలవ్వడంతో.. జిల్లాలో మరోసారి పసుపు బోర్డు అంశం తెరపైకొచ్చింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ.. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపి అర్వింద్ రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. అక్టోబర్ నెలలో ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ పసుపు మండలి ఏర్పాటు చేస్తూ.. వాణిజ్యశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహణ, పర్యవేక్షణ ఉంటుందని పేర్కొంది.

పసుపు సీజన్ మొదలవ్వడంతో.. జిల్లాలో మరోసారి పసుపు బోర్డు అంశం తెరపైకొచ్చింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ.. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపి అర్వింద్ రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. అక్టోబర్ నెలలో ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ పసుపు మండలి ఏర్పాటు చేస్తూ.. వాణిజ్యశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహణ, పర్యవేక్షణ ఉంటుందని పేర్కొంది. ఐతే దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది.? ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయా.? ఎప్పటి లోపు అందుబాటులోకి వస్తుంది అన్నది స్పష్టత లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రారంభం కావడంతో.. పసుపు బోర్డు ఫలాలు ఈ సీజన్లో అందుతాయా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రలోనే అత్యధిక పసుపు సాగు చేసే.. ఆర్మూర్ డివిజన్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా రైతులు. మూడు దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం పోరాటం చేసి సాధించుకున్నామన్న ఆనందం ఉన్నా.. అది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలియక దిగాలు చెందుతున్నారు రైతులు. పసుపు సీజన్ మొదలు కావడంతో.. గిట్టుబాటు ధర ఇప్పించేలా కేంద్రం చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.
గత ఎన్నికల్లో హై ఎఫెక్ట్ అంశంగా పసుపు బోర్డు
గత సార్వత్రిక ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని ప్రస్తుత ఎంపి ధర్మపురి అర్వింద్ బాండు పేపర్పై రాసిచ్చిన అంశం సంచలనం సృష్టించింది. అంతకు ముందు ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత.. పలు మార్లు ఢిల్లీ పెద్దలను కలిసి పసుపు బోర్డు కోసం లేఖలు రాశారు. పార్లమెంట్ వేదికగా గళం విప్పారు. 2019 ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా నిజామాబాద్ పార్లమెంట్ స్ధానానికి 176 మంది రైతులు నామినేషన్లు వేసి పోటీలో నిలిచారు. రైతుల పోటీ అంశం దేశ స్దాయిలో చర్చకు దారితీసింది. పసుపు సుగంధ్ర ద్రవాల్లో ఒకటిగా ఉండటంతో.. స్పైసెస్ బోర్డు పరిధి కొనసాగింది. అర్వింద్ ఎంపీగా గెలిచాక వరంగల్లో ఉన్న స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని నిజామాబాద్కు రప్పించారు. ఐతే రైతులు మాత్రం స్పైసెస్ బోర్డు కాదు. పసుపు బోర్డు కావాలంటూ తమ పోరాటం కొనసాగించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వెల్లడించింది. దీంతో రైతులు ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేశారు. ఇచ్చిన హామీ నేరవేర్చలేదంటూ ఎంపి అర్వింద్ పర్యటనలను రైతులు అడ్డుకున్నారు. రానున్న ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం కీలకంగా మారుతున్న తరుణంలో.. ప్రధాన మంత్రి మహబూబ్ నగర్ సభలో.. పసుపు బోర్డుపై తీపి కబురు అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని మద్దతు ధర వచ్చేందుకు రాష్ట్రంలో బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. పసుపు బోర్డు మోదీ హయాంలో రావడం ఎంతో ఉపయోగం అంటున్నారు ఎంపి అర్వింద్.
బోర్డు ఎక్కడ అనే అంశం పై క్లారిటి ఇవ్వాలి – రైతులు
పసుపు సాగుకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతం ప్రసిద్ది.. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో 42వేల ఎకరాల్లో పసుపు సాగు చేస్తారు. ఐతే కొంత కాలంగా పసుపుకు గిట్టు బాటు ధర లేక, పసుపు దిగుబడులు తగ్గిపోవడంతో రైతులు పసుపు సాగు తగ్గించారు. ప్రస్తుతం గత సంవత్సరం జిల్లాలో 25వేల ఎకరాల్లో పసుపు సాగు చేయగా.. ఈ సారి 20వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు. మార్కెట్ ఒడిదొడుకులు పసుపు సాగుకు రైతులను దూరం చేస్తోంది. పసుపుకు మద్దతు ధర లేకపోవడం, గిట్టుబాట ధర రాకపోవడంతో సాగుకు దూరం అవుతున్నారు. గిట్టు బాటు ధర వస్తే.. మళ్లీ పంట సాగు చేస్తామంటున్నారు రైతులు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే.. తమకు మద్దతు ధర వస్తుందని రైతులు ఆశ పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పసుపు ధర కలిసొస్తేనే రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకుంటే ఈ ప్రభావం నిజామబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్ధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సాగు విస్తీర్ణం తగ్గడంతో డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సీజన్లోనైనా పచ్చ బంగారం రైతుల పచ్చగా ఉంటారా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




