Secunderabad: గ్యాంగ్ సినిమా చూసి స్కెచ్.. జ్యూవెలరీ షాపును దోచుకున్న ఫేక్ ఐటీ అధికారులు

హీరో సూర్య నటించిన 'గ్యాంగ్‌' సినిమాను చూసి ఓ ముఠా జ్యువెల్లరీ షాప్‌ను దోచుకుంది. ఇన్​కమ్‌ట్యాక్స్ అధికారులమంటూ ఫేక్ ఐడీ కార్డులు చూపించి సికింద్రాబాద్ పాట్ మార్కెట్‌లోని సిద్ధి వినాయక జ్యూవెలరీ షాపులో ఓ దొంగల ముఠా..

Secunderabad: గ్యాంగ్ సినిమా చూసి స్కెచ్.. జ్యూవెలరీ షాపును దోచుకున్న ఫేక్ ఐటీ అధికారులు
Fake IT officials robbery
Follow us

|

Updated on: May 31, 2023 | 10:03 AM

హీరో సూర్య నటించిన ‘గ్యాంగ్‌’ సినిమాను చూసి ఓ ముఠా జ్యువెల్లరీ షాప్‌ను దోచుకుంది. ఇన్​కమ్‌ట్యాక్స్ అధికారులమంటూ ఫేక్ ఐడీ కార్డులు చూపించి సికింద్రాబాద్ పాట్ మార్కెట్‌లోని సిద్ధి వినాయక జ్యూవెలరీ షాపులో ఓ దొంగల ముఠా శనివారం చోరీకి పాల్పడింది. ఈ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..

సికింద్రాబాద్‌కు చెందిన మహేందర్ బాబు నవకేతన్ కాంప్లెక్స్‌లోని సిద్ధి వినాయక జ్యూవెలర్స్ షాపు నిర్వహిస్తున్నాడు. హర్షద్ గోల్డ్ మెల్టింగ్‌లో తయారు చేసిన నగలన్నీ సిద్ధి వినాయక జ్యూవెలర్స్‌కు సప్లై చేసేవారు. గత నెల రోజులుగా మహారాష్ట్రలోని ఖానాపూర్‌కు చెందిన జకీర్ ఘనీ (35) అనే వ్యక్తి మెల్టింగ్ షాపులో పనిచేస్తున్నాడు. గతంలో సిద్ధి వినాయక జ్యూవెలరీ షాపులో కూడా అతను పని చేశాడు. రెండు షాపుల్లో గోల్డ్ బిస్కెట్స్ ఉండటం గమనించిన జకీర్.. ప్లాన్​లో భాగంగా కొన్ని రోజులు రెక్కీ నిర్వహించాడు.

సినిమాలు చూసి దోపిడీకి పాల్పడ్డ మహారాష్ట్ర, గోవా ముఠా

మహారాష్ట్రలోని ఖానాపూర్‌కు చెందిన తన ఫ్రెండ్స్ రెహ్మాన్ గఫూర్‌(30), ప్రవీణ్ యాదవ్‌(32), ఆకాశ్ అరుణ్ (31), అభిజిత్ కుమార్‌‌, అమోల్, గనపాత్ర జాదవ్‌, గోవాకు చెందిన సిద్ధనాథ్, సంజయ్ పరుశరామ్, వినోద్ జాదవ్, అజయ్ జాదవ్​తో కలిసి జకీర్ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ‘గ్యాంగ్’, ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి అచ్చం అలాగే చేయాలని కూడబలుక్కున్నారు. 10 ఫేక్ ఇన్​కమ్ ట్యాక్స్​ఐడీ కార్డులు తయారు చేసుకుని 24వ తేదీన బస్సు, ట్రైన్‌లలో సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లోని ఢిల్లీ లాడ్జ్‌లో దిగారు.

ఇవి కూడా చదవండి

పక్కా ప్లాన్‌తో శనివారం ఉదయం 11.40 గంటలకు 10 మంది సిద్ధి వినాయక జ్యూవెలర్స్‌లోకి ప్రవేశించి ఐడీ కార్డులు చూపించి తాము ఐటీ అధికారులమని నమ్మించారు. అందరి సెల్​ఫోన్స్ స్వాధీనం చేసుకుని సోదాలు ప్రారంభించారు. రూ.60లక్షలు విలువ చేసే 17 బంగారం బిస్కెట్లకు (1700 గ్రాములు) సంబంధించి ఎలాంటి ట్యాక్స్ కట్టలేదని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి నోటీసులివ్వకుండా వెళ్లిపోయారు. షాపు మేనేజర్ వికాస్ తోటి జ్యూవెలరీ షాపుకు చెప్పగా.. ఐటీ అధికారులు తనిఖీలు చేయరని, ముందుగా నోటీసులిస్తారని చెప్పడంతో వెంటనే మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

నలుగురు అరెస్ట్

సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు వర్కర్స్​పై అనుమానంతో విచారించగా జకీర్ ఘనీ ప్లాన్​బయటపడింది. ఖానాపూర్ వెళ్లి రెహ్మాన్​గఫూర్, జకీర్, ప్రవీణ్, ఆకాశ్ అరుణ్‌లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 7 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 బిస్కెట్లు గోవా గ్యాంగ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.