
తెలంగాణలో నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్నాయి. ఏదీ నకిలీయో ఏదీ అసలు అనేది అంతుపట్టడం లేదు. తినే తిండి నుంచి వాడే సబ్బుల వరకు అన్నీ నకిలీవే. బ్రాండెడ్ కంపెనీల పేర్లతో సబ్బులు, కొబ్బరి నూనె, టీ పొడి వంటి వస్తువులను నకిలీగా మార్చేస్తున్నారు. తక్కువ ధరకు అమాయకులైన వినియోగదారులకు అంటగడుతూ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నకిలీ వస్తువులు కలకలం సృష్టించాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మినీ వ్యాన్లో నకిలీ సరుకులు విక్రయించేందుకు కొందరు ప్రయత్నించారు. దీంతోపాటు కొంతకాలంగా పట్టణంలోని కిరాణా షాపులకు తక్కువ ధరకు బ్రాండెడ్ పోలిన నకిలీ వస్తువులను సరఫరా చేస్తున్నారు.
ఈ క్రమంలో పట్టణంలోని ఇందిరా సెంటర్లో కొన్ని దుకాణాల వద్ద నకిలీ సరుకులు దిగుమతి చేస్తుండగా స్థానిక వ్యాపారులు కొందరు వీరిని పట్టుకున్నారు. ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ సబ్బులు, షాంపూలు, కొబ్బరి నూనె, టీ పొడిని విక్రయిస్తున్నట్లు వ్యాపారులు గుర్తించారు. ముఖ్యంగా మైసూర్ శాండిల్, పారాషూట్, రెడ్ లేబుల్ వంటి బ్రాండ్ల పేర్లతో వినియోగదారులను మోసం చేస్తున్నారు. బ్రాండెడ్ వస్తువుల డీలర్లు.. నకిలీ వస్తువులను రవాణా చేసి విక్రయిస్తున్న నలుగురిని నిలదీశారు. ఈ మినీ వ్యాన్లో 10 లక్షల రూపాయల విలువైన మైసూర్ శాండిల్, పారాషూట్, ఏరియల్ సర్ఫ్, గుడ్ నైట్ సంబంధించిన నకిలీ వస్తువులు ఉన్నట్లు వ్యాపారులో గుర్తించారు.
ఈ వస్తువుల ఏజెన్సీ డీలర్లు ఆయా కంపెనీలకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నకిలీ వస్తువులపై స్థానిక పోలీసులకు వ్యాపారులు సమాచారం ఇచ్చారు. మినీ వ్యాన్ను స్వాధీనం చేసుకోవడంతోపాట నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బేగంపేట నుండి నకిలీ వస్తువులను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తక్కువ ధరకు అమ్మే నకిలీ వస్తువుల పట్ల వినియోగదారుల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..