Revanth Reddy: రైల్వే మంత్రితో సీఎం రేవంత్, కిషన్ రెడ్డి భేటీ.. హైదరాబాద్ మెట్రోపై కీలక చర్చలు..
తెలంగాణకు ఆ ఇద్దరూ కీలక నేతలే. ఒకరు రాష్ట్ర స్థాయిలో.. మరొకరు కేంద్రస్థాయిలో చక్రం తిప్పుతున్నారు. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలు సైతం భిన్న ధృవాల్లాంటివే. అలాంటి నేతలు.. ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చారా? రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి నడవబోతున్నారా? ఇప్పుడు రాజకీయంగా అదే చర్చ జరుగుతోంది.

గత కొన్నాళ్లుగా నువ్వానేనా అన్నట్టుగా పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. ఇప్పుడు రాష్ట్రం కోసం ఒక్కటిగా అడుగులు వేస్తున్నారనే చర్చ మొదలైంది. వీళ్లిద్దరూ ఒక్కటిగా.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ని కలవడం పొలిటికల్గా చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ఉంటూ.. మెట్రో రైల్ విస్తరణకు సహకరించడం లేదంటూ.. కొన్ని రోజులుగా కిషన్రెడ్డిని టార్గెట్ చేస్తూ.. విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు సీఎం రేవంత్. కేంద్రం నుంచి ప్రాజెక్టులు రాకుండా.. కిషన్రెడ్డే అడ్డుపడుతున్నారంటూ.. తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి కిషన్రెడ్డి సహా బీజేపీ కీలక నేతలు.. అంతే ఘాటుగా బదులిచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే నడిచింది.
అశ్విని వైష్ణవ్ని కలిసిన రేవంత్, కిషన్
అయితే మెట్రో రైల్ పెండింగ్ అంశాలకు సంబంధించి చొరవ తీసుకోవాలని కోరుతూ.. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి లేఖరాశారు సీఎం రేవంత్రెడ్డి. ఈనెల 22, 23 తేదీల్లో తాను ఢిల్లీలోనే ఉంటాననీ.. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖకు స్పందించిన కిషన్రెడ్డి.. సీఎం కోరినట్టుగా కేంద్రమంత్రితో మీటింగ్ ఏర్పాటు చేయించారు. ఇద్దరు నేతలు కలిసి.. అశ్విని వైష్ణవ్ని కలిసి.. మెట్రో అంశంపై చర్చించారు. చర్చలు సానుకూలంగా ఉన్నాయని, త్వరలో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సీఎం రేవంత్ రడ్డి ధీమా వ్యక్తం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా డైలాగ్ వార్కు కారణమవుతున్న మెట్రో అంశంలో ఇద్దరు అగ్రనేతలు కలిసి ముందుకు రావడం ఆసక్తిరేపుతోంది.
రాజ్నాథ్ సింగ్తో సీఎం భేటీ
ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు లాంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రికి తెలిపారు.
