AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాటలకందని మహావిషాదం.. చేవెళ్ల బస్సు ఘటనపై కేసు నమోదు.. ఆ మృతదేహాలకు ఆల్కహాల్‌ పరీక్షలు

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుండెకన్నీరయ్యే విషాదం.. చూడ్డానికి.. చెప్పడానికి వీలేనంత విచలిత దృశ్యాలు.. బిడ్డలను కోల్పోయి కన్నవాళ్లు... అమ్మానాన్న ఇక లేరని.. వాళ్లు ఎప్పటికీ రారని బిడ్డల అరణ్య రోదన.. ఇలా చెవేళ్ల దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.. ఎవరి నిర్లక్ష్యానికో 19 మంది నిండు ప్రాణాలు బలైపోయాయి.. కుటుంబాలకు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.

మాటలకందని మహావిషాదం.. చేవెళ్ల బస్సు ఘటనపై కేసు నమోదు.. ఆ మృతదేహాలకు ఆల్కహాల్‌ పరీక్షలు
Chevella Bus Accident
Shaik Madar Saheb
|

Updated on: Nov 04, 2025 | 8:30 AM

Share

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుండెకన్నీరయ్యే విషాదం.. చూడ్డానికి.. చెప్పడానికి వీలేనంత విచలిత దృశ్యాలు.. బిడ్డలను కోల్పోయి కన్నవాళ్లు.. అమ్మానాన్న ఇక లేరని.. వాళ్లు ఎప్పటికీ రారని బిడ్డల అరణ్య రోదన.. ఇలా చెవేళ్ల దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.. ఎవరి నిర్లక్ష్యానికో 19 మంది నిండు ప్రాణాలు బలైపోయాయి.. కుటుంబాలకు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. చేవెళ్ల-మీర్జాగూడ బస్సు-టిప్పర్‌ ప్రమాద మృతులకు పోస్ట్‌మార్టమ్‌ పూర్తయింది. 19 మంది మృతదేహాలను వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. చేవెళ్ల బస్సు-టిప్పర్‌ ప్రమాదంపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. కండక్టర్‌ రాధా, మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చేవెళ్ల పీఎస్‌లో FIR నమోదైంది.. టిప్పర్‌ డ్రైవర్‌ ఆకాష్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. 106(1) BNS సెక్షన్‌ కింద FIR నమోదైంది. ఇదిలాఉంటే.. చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

టిప్పర్ డ్రైవర్ అన్న ఏమన్నాడంటే..

కాగా.. టిప్పర్‌, బస్సు డ్రైవర్ల మృతదేహాలకు ఆల్కహాల్‌ పరీక్షలు నిర్వహించారు. ఆకాష్‌కి మద్యం తాగే అలవాటు లేదని అతని అన్న పేర్కొన్నాడు.. పదేళ్లుగా డ్రైవింగ్‌ ఫీల్డ్‌లో ఉన్నాడని.. సంగారెడ్డిలో ఉంటూ పనిచేస్తున్నాడని..ఆకాష్‌ అన్న తెలిపాడు..

చేవెళ్ల బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు

చేవెళ్ల బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టిప్పర్‌, క్రషర్‌, కన్‌స్ట్రక్షన్‌ ఓనర్లను పోలీసులు విచారించనున్నారు. టిప్పర్‌ క్లీనర్‌ను కూడా దర్యాప్తు బృందం ప్రశ్నించనుంది. ఈ ప్రమాదంలో గాయపడిన టిప్పర్‌ ఓనర్‌ లక్ష్మణ్‌నాయక్‌ ప్రస్తుతం వికారాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్నాడు.. ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్‌లో డ్రైవర్‌ ఆకాష్‌తోపాటే యజమాని లక్ష్మణ్‌నాయక్‌ ఉన్నాడు.. పటాన్‌చెరు క్రషర్‌ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ది ఆకాష్‌ది మహారాష్ట్ర కాగా.. టిప్పర్‌ ఓనర్‌ది మహబూబ్‌నగర్‌.. అని పోలీసులు తెలిపారు.

తాండూరు నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన బస్సు.. 70 మంది ప్రయాణికులు..

చేవెళ్ల బస్ ప్రమాదంలో ఇప్పటివరకూ 19మంది ప్రయాణికులు మరణించగా.. మరో ముగ్గురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు అధికారులు. తెల్లవారుజామున 4గంటల 40నిమిషాలకు తాండూరు నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన H-003 సర్వీస్‌ నెంబర్‌ బస్సులో సుమారు 70మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 6గంటల 15నిమిషాలకు చేవెళ్ల ఇంద్రారెడ్డినగర్ దగ్గరకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. స్పాట్‌లోనే 17మంది మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  మరో 20 మందికి గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక, ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ నెంబర్‌ను TG 06 T 3879గా వెల్లడించారు పోలీసులు. అతివేగంతో బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టడం.. కంకర మీద పడటంతో.. ప్రయాణికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

బస్ ప్రమాద మృతుల వివరాలను వెల్లడించిన అధికారులు..

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ దస్తగిరిబాబా.. టిప్పర్‌ డ్రైవర్‌ ఆకాష్‌ మరణించారు. మరణించిన మిగతా ప్రయాణికులను దాస్యం నాగమణి, తారాబాయి, తబుస్సం జహాన్, గుర్రాల అఖిల, పానుగుల కల్పన, నల్లగండ్ల హన్మంతు, గోగుల గుణమ్మ, షేక్ కలద్‌ హుస్సేన్, తలియా బేగమ్‌, నందిని, సాయిప్రియ, తనూష, ముస్కాన్, దస్తగిరి, ఆకాశ్‌ కామ్లే, కూడుగుంట బండప్పగా గుర్తించారు.

ఇందులో తారిబాయ్‌ది గంగారం తండా కాగా.. పానుగుల కల్పనది హైదరాబాద్‌ బోరబండ.. గోగుల గుణమ్మది కూడా బోరబండ.. షేక్‌ హుస్సేన్‌, తనూషా, తబస్సుమ్‌ జహాన్‌, తాలియా బేగం, సాయిప్రియ, నందిని.. వీళ్లంతా తాండూరు వాసులు. నాగమణిది కర్నాటక భానూర్ కాగా.. మల్లగండ్ల హనుమంతుది దౌల్తాబాద్.. గుర్రాల అభితది యాలాల్‌గా గుర్తించారు.

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన..

మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం తరపున 5లక్షలు, కేంద్రం నుంచి 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కొనసాగుతుందన్నారు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి. ప్రమాదంపై పోలీసుల విచారణ కొనసాగుతుందన్నారు. నివేదికంగా ఆధారంగా చట్ట ప్రకారంచర్యలు తీసుకుంటామన్నారు.