Telangana Dalit Bandhu: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు.. దళితబంధు నిలిపివేయాలని ఆదేశం
Telangana Dalit Bandhu: తెలంగాణ దళితబంధు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ..
Telangana Dalit Bandhu: తెలంగాణ దళితబంధు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నికల దృష్ట్యా తెలంగాణలోని హుజూరాబాద్లో దళితబంధు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దళితబంధు అమలు ఆపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీ లేఖ రాసింది. ఈ లేఖతో హుజురాబాద్లో దళిత బంధు పథకానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలు లేఖలు అందాయి. అన్ని పార్టీల ఫిర్యాదులన్నీ కలిపి ఒక లేఖగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందింది. అదే ఈ లేఖ నెం.3077/EL ECSA/A!/2021/43 తెలంగాణ ఈసీ నుంచి అందిన నివేదిక ఆధారంగా దళిత బంధు నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. ఉప ఎన్నిక తర్వాత దళిత బంధు పథకం యథావిధిగా కొనసాగించవచ్చని సూచించింది.
కాగా, తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం ఈ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి కల్పన కోసం..30 రకాల పథకాలను, కార్యక్రమాల జాబితాను విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం మినీ డెయిరీ యూనిట్ నుంచి మినీ సూపర్ బజార్ వరకు వివిధ రకాల స్వయం ఉపాధి పథకాలను ఇందులో పొందుపరిచింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన 30 పథకాల్లో తమకు నచ్చిన ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈనెల 30న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.