Jasprit Bumrah : హిస్టరీ క్రియేట్ చేయనున్న జస్ప్రీత్ బుమ్రా..సెమీస్లో ఒక్క వికెట్ తీస్తే చాలు
టీమిండియా గన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెరీర్లో ఒక మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బుమ్రా 500 వికెట్ల క్లబ్లో చేరడానికి సరిగ్గా ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు భారత క్రికెట్ చరిత్రలో కేవలం ఏడుగురు బౌలర్లు మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించారు.

Jasprit Bumrah :టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్కు చేరుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ పోరుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ మ్యాచ్ కేవలం భారత్ ఫైనల్ చేరుతుందా లేదా అన్నదానికే పరిమితం కాలేదు.. టీమిండియా గన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెరీర్లో ఒక మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బుమ్రా 500 వికెట్ల క్లబ్లో చేరడానికి సరిగ్గా ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు భారత క్రికెట్ చరిత్రలో కేవలం ఏడుగురు బౌలర్లు మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించారు. ఇప్పుడు ఆ దిగ్గజాల సరసన బుమ్రా పేరు కూడా చేరబోతోంది.
ప్రస్తుతం బుమ్రా గణాంకాలు చూస్తే.. మూడు ఫార్మాట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి మొత్తం 499 వికెట్లు పడగొట్టాడు. ఇందులో టెస్టుల్లో 234 వికెట్లు, వన్డేల్లో 149 వికెట్లు, టీ20 ఇంటర్నేషనల్స్లో 116 వికెట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్తో జరిగే ఈ సెమీఫైనల్ మ్యాచ్లో బుమ్రా ఒక్క వికెట్ తీసినా, అంతర్జాతీయ స్థాయిలో 500 వికెట్ల మార్కును అందుకున్న ఎనిమిదో భారత బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఒక ఫాస్ట్ బౌలర్గా, అది కూడా గాయాల బెడదను తట్టుకుంటూ ఇన్ని వికెట్లు తీయడం బుమ్రాలోని అసాధారణ ప్రతిభకు నిదర్శనం.
భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాను పరిశీలిస్తే.. అనిల్ కుంబ్లే (956), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (717), కపిల్ దేవ్ (687), రవీంద్ర జడేజా (634), జహీర్ ఖాన్ (610), జవగల్ శ్రీనాథ్ (551) వంటి దిగ్గజాలు ఉన్నారు. ఇప్పుడు బుమ్రా కూడా ఈ ఎలైట్ లిస్టులోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాంఖెడే వంటి బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో బుమ్రా పాత్ర కీలకం కానుంది. జోస్ బట్లర్ లేదా సాల్ట్ వంటి కీలక వికెట్లను బుమ్రా తన 500వ వికెట్గా మార్చుకుంటాడేమో చూడాలి.
ఈ వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా సాగుతోంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఒక్క ఓటమి మినహా, భారత్ అన్ని మ్యాచ్ల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా సూపర్ 8 చివరి పోరులో వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్కు దూసుకొచ్చింది. అటు ఇంగ్లాండ్ కూడా బలంగా ఉంది. ఇలాంటి హై వోల్టేజ్ మ్యాచ్లో బుమ్రా తన పదునైన యార్కర్లతో ఇంగ్లాండ్ వికెట్లను పడగొట్టి భారత్ను ఫైనల్కు చేరుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. బుమ్రా రికార్డుతో పాటు భారత్ గెలుపు కూడా తోడైతే వాంఖడేలో పండుగే పండుగ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
