Telangana: తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన కేంద్రం.. రెండు రోజులే గడువిస్తూ నోటీసులు.. లేకపోతే..
Central Govt Vs Telangana Govt: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. దారి మళ్లీంచిన నిధులను నవంబర్ 30 లోపల చెల్లించాలంటూ కేంద్రం రాష్ట్రానికి నోటీసులు పంపింది.
Center notices to Telangana government: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. దారి మళ్లీంచిన నిధులను నవంబర్ 30 లోపల చెల్లించాలంటూ కేంద్రం రాష్ట్రానికి నోటీసులు పంపింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) లో జరిగిన అవకతవకలపై కేంద్రం రాష్ట్రంపై సీరియస్ అయ్యింది. ఉపాధి హామీ నిధులను వేరే పథకాలకు దారిమళ్లించిన రూ.152కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో నిధులు చెల్లించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేకపోతే తదుపరి వాయిదాలు నిలిపివేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. కాగా.. ఉపాధి హామీ నిధులు దారిమళ్లింపునకు సంబంధించి జూన్ 9 నుంచి 12 మధ్య కేంద్ర బృందం.. తెలంగాణలో పర్యటించింది. ఉపాధి హామీ పథకం నిధులను అనుమతి లేని పథకాలకు వినియోగించినట్లు బృందం గుర్తించింది. ఉపాధి హామీ పథకం అమలులో, పనుల కేటాయింపుల్లో కూడా పలు అవకతవకలు జరిగాయని నిర్ధారించి.. ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించింది.
ఉపాధి హామీ నిధులను చేపలు ఎండబెట్టే ప్లాట్ఫాంలు, అడవుల్లో ట్రెంచ్ల తవ్వకం వంటి అనుమతి లేని పనులకు తెలంగాణ ప్రభుత్వం నిధులను ఖర్చు చేసినట్లు బృందం నివేదికలో తెలిపింది. గడువులోగా తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే గ్రామీణ ఉపాధిహామీ పథకం చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీని ప్రకారం తదుపరి విడుదలయ్యే నిధులను నిలిపివేసేందుకు కేంద్రానికి అధికారం ఉందని నోటీసుల్లో వివరించింది.
కాగా.. ఇప్పటికే.. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో వరి కొనుగోళ్లు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రానికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..