Telangana: భైంసాలో బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ కండీషన్స్ అప్లై
భైంసాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులు పెట్టింది.
బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. భైంసా బయట బహిరంగ సభ పెట్టుకోవాలని సూచించింది. పాదయాత్ర భైంసా టౌన్ మీదుగా వెళ్ళకూడదని ఆదేశించింది. బైంసాకి మూడు కిలోమీటర్లు దూరంలో సభ పెట్టుకోవాలని కోర్టు సూచన చేసింది. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాదయాత్రలు, ర్యాలీలు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, వాటిని అనుమతి నిరాకరించడం సరికాదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం నుంచి బండి సంజయ్ తలపెట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఉదయం నుంచి హైటెన్షన్ నెలకుంది. పాదయాత్ర కోసం బండి సంజయ్ కరీంనగర్ నుంచి నిర్మల్ వెళ్తుండగా ఆయన్ని పోలీసులు కోరుట్ల సమీపంలోని వెంకటాపురంలో అడ్డుకున్నారు. దీంతో ఆయన కరీంనగర్కు తిరిగివచ్చారు. ఆపై కోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. హైకోర్టు పర్మిషన్తో బండి సంజయ్ పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం కొనసాగే చాన్స్ ఉంది.
సభను అడ్డుకోవడం పిరికిపంద చర్య అని బీజేపీ నేతల విమర్శలు
బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం సీఎం కేసీఆర్ పిరికిపంద చర్యలకు నిదర్శనమన్నారు డీకే అరుణ. బీజేపీ బలపడటాన్ని ఓర్వలేకే ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారామె. బండి సంజయ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. అటు తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారారని ఆరోపించారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి తథ్యమన్నారాయన. మొత్తానికి బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..