Hyderabad: బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్!
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండటంతో కొడుకు చదువుపై శ్రద్ధ పెట్టాలని ఓ తండ్రి మందలించాడు. బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని హితబోధ చేశాడు. అయితే ఆ మాటలతో మనస్తాపం చెందిన కొడుకు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని..

హైదరాబాద్, డిసెంబర్ 28: బాగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో పదో తరగతి విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని దోమల్ గోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ మైసమ్మ నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
హైదరాబాద్లోని దోమల్ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కాపుర ఉంటున్న రాకేష్ ,లత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన కొల్లా అరవింద్ (15) గాంధీ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో టైం వేస్ట్ చేయకుండా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని తండ్రి కుమారుడిని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన పదో తరగతి విద్యార్థి అరవింద్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
గమనించిన కుటుంబ సభ్యులు అరవింద్ను కిందకు దించి.. పరుగు పరుగున గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అరవింద్ మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




