శ్రీలంక టూర్కు ముందే బీసీసీఐ సంచలన నిర్ణయం.. కోచ్లకు వార్నింగ్.. ఎందుకంటే?
BCCI Review Meeting Player Injuries: ఆటగాళ్ల గాయాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే రాబోయే మెగా టోర్నీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. లంక సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ తీసుకోబోయే కఠిన నిర్ణయాలు భారత క్రికెట్ భవిష్యత్తును ఏ విధంగా మారుస్తాయో వేచి చూడాలి.

BCCI Review Meeting Player Injuries: భారత క్రికెట్ జట్టును వరుసగా వేధిస్తున్న గాయాల సమస్య బీసీసీఐని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. కీలక ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రుల పాలవుతుండటంతో బోర్డు పెద్దలు రంగంలోకి దిగారు. శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే సమీక్షా సమావేశం నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవ్వడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
ఇటీవలి కాలంలో బిజీ షెడ్యూల్ కారణంగా భారత క్రికెటర్లు పదేపదే గాయాల బారిన పడుతుండటం మేనేజ్మెంట్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఇప్పటికే గాయాలతో దూరమవ్వగా, తాజాగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం గాయపడటం టీమిండియా శిబిరంలో కొత్త టెన్షన్ పెంచేసింది. కీలక ఆటగాళ్లు పూర్తి స్థాయిలో కోలుకోకుండానే మైదానంలోకి దింపుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో జట్టు మెడికల్ టీమ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని సపోర్ట్ స్టాఫ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీసీసీఐ అలర్ట్.. హెడ్ కోచ్ సహా అందరిపై రివ్యూ..
ఆటగాళ్ల ఫిట్నెస్ లోపాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టిగా దృష్టి సారించింది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ పూర్తయిన వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా టీమ్ ఫిజియోథెరపిస్ట్ కమలేష్, జట్టు డాక్టర్ రిజ్వాన్ పనితీరుపై లోతైన విచారణ జరపనున్నారు. వైద్య నివేదికల వెనుక నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో సహా కోచింగ్ విభాగంలోని ప్రతీ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు బోర్డు అడుగులు వేస్తోంది. దీంతో లంక పర్యటనకు బయలుదేరుతున్న కోచింగ్ సిబ్బందిలో వణుకు మొదలైంది.
శ్రీలంక టూర్కు పయనమైన గిల్ సేన..
ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరగబోయే అత్యంత కీలకమైన రెండు టెస్టుల సిరీస్ కోసం శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు నేడు కొలంబోకు బయలుదేరి వెళ్లింది. పర్యటనలో భాగంగా ఈ నెల 7 నుంచి 9 వరకు కొలంబో వేదికగా టీమిండియా మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత గాలే మైదానంలో ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక మధ్య మొదటి టెస్టు సమరం ప్రారంభం కానుంది. గాయాల కలకలం నడుమ యంగ్ ఇండియా ఈ సిరీస్ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇదికూడా చదవండి: Video: ఇలాంటి ఔట్ చూశారా.. బద్దకంతో వికెట్ పారేసుకున్న టీమిండియా ప్లేయర్.. ఎవరంటే?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు గందరగోళం..
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం. రాబోయే రోజుల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో భారత్ తలపడాల్సి ఉంది. మొత్తం తొమ్మిది టెస్టుల్లో ఫైనల్ చేరాలంటే కనీసం ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించడం అనివార్యంగా మారింది. దాంతో శ్రీలంకపై రెండు టెస్టుల్లోనూ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా గిల్ సేన వ్యూహాలు రచిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




