ఇదేందయ్యా బుమ్రా.. హీరో అనుకుంటే, టీమిండియా పాలిట విలన్లా మారినవ్..!
Jasprit Bumrah Injury India vs Sri Lanka Test Series: కీలక సమయంలో బుమ్రా దూరం కావడం టీమిండియా బౌలింగ్ విభాగానికి తీరని లోటే. అయితే ఈ పరిస్థితుల్లో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకిబ్ నబీలు బాధ్యత తీసుకుని భారత్ను గెలిపిస్తారో లేదో వేచి చూడాలి!

Jasprit Bumrah Injury India vs Sri Lanka Test Series: శ్రీలంకతో జరగబోయే అత్యంత కీలకమైన రెండు టెస్టుల సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా ఈ కీలక పోరుకు దూరమయ్యాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ గెలవడం భారత్కు ఎంతో ఆవశ్యకం!
ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా ఎడమ మోకాలికి గాయమైంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోలుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, మోకాలి వాపు ఇంకా తగ్గకపోవడంతో వైద్య బృందం అతనికి పూర్తి విశ్రాంతిని సిఫార్సు చేసింది. రాబోయే సుదీర్ఘ క్రికెట్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సెలెక్టర్లు అతనికి ఈ సిరీస్ మినహాయింపు ఇచ్చారు. బుమ్రా స్థానంలో జమ్మూ కాశ్మీర్ యువ వేగపంతం ఆకిబ్ నబీని జట్టులోకి ఎంపిక చేశారు.
ఆసియా పిచ్లపై తిరుగులేని రికార్డు..
సాధారణంగా ఉపఖండంలో పిచ్లు స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయి. అయినప్పటికీ జస్ప్రీత్ బుమ్రా తన పదునైన యార్కర్లు, రివర్స్ స్వింగ్తో ప్రత్యర్థి బ్యాటర్ల నడుము విరిచేవాడు. ఆసియా వేదికగా ఇప్పటివరకు ఆడిన 16 టెస్టుల్లో కేవలం 17.7 సగటుతో 62 వికెట్లు తీసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. శ్రీలంకపై ఆడిన రెండు మ్యాచుల్లోనే ఏకంగా 10 వికెట్లు పడగొట్టిన రికార్డు అతని సొంతం. అతడు లేకపోవడం లంక బ్యాటర్లకు పెద్ద ఊరటనిచ్చే అంశమే.
గాయాల సమస్యతో నలిగిపోతున్న పేస్ గుర్రం..
గత కొంతకాలంగా జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల బారిన పడటం టీమిండియాను తీవ్రంగా కలవరపెడుతోంది. ఏడాది కాలంలో వివిధ గాయాల కారణంతో అతను ప్రధాన సిరీస్లకు దూరమవడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. న్యూజిలాండ్ వన్డేలు, ఐర్లాండ్ టి20లు, ఇంగ్లండ్ పర్యటనలోని కొన్ని మ్యాచ్లతో పాటు ఇప్పుడు శ్రీలంక టెస్ట్ సిరీస్కు కూడా దూరమయ్యాడు. ప్రధాన బౌలర్ పదేపదే గాయపడటం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తోంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసుపై ప్రభావం..
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆగస్టు 15 గాడే వేదికగా ప్రారంభమయ్యే ఈ రెండు టెస్టుల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంది. ఇప్పటికే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు గాయాలతో సగం జట్టుకు దూరం కావడంతో, బుమ్రా లేకపోవడం కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్కు పెద్ద సవాలుగా మారనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




