
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన వేళ తెలంగాణలో హైటెన్షన్ నెలకొంది. పేపర్ లీక్, సింగరేణి ప్రైవేటీకరణ, లిక్కర్ స్కాం ఇలా పలు విషయాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చాయి. విపక్షాల నిరసనలతో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై మండిపడ్డాయి విపక్షాలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి 30 ప్రశ్నలతో లేఖ సంధించారు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. తన 30 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు భట్టి. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై ప్రధానితో సహా కేంద్ర మంత్రులు విమర్శలు చేస్తున్నారే తప్పా.. వాటిపై విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు సీఎల్పీ లీడర్. కేంద్ర విద్యాసంస్థలు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. నీటి వాటా కేటాయింపులు.. పారిశ్రామిక రాయితీలు.. రెండు కోట్ల ఉద్యోగాల కేటాయింపులపై మోదీకి రాసిన లేఖలో ప్రశ్నలు సంధించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎందుకు పురోగతి లేదో రాష్ట్రానికి వస్తున్న మోదీ చెప్పాలని.. మీకు.. సీఎం కేసీఆర్కు మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా అని నిలదీశారు భట్టి.
మరోవైపు పేపర్లీక్ వివాదంపై ఆందోళనకు సిద్ధమైంది యూత్ కాంగ్రెస్..! ఈమేరకు హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. పేపర్ లీక్లో బండిపాత్రపై మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు నేతలు. సోమవారం ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి.. 18న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు యూత్ కాంగ్రెస్, NSUI నేతలు ప్రకటించారు.
సింగరేణి ప్రైవేటీకరణపై BRS పోరుబాటకు సిద్ధమైంది. కేంద్రంలోని BJP సర్కారుపై జంగ్ సైరన్ మోగిస్తుంది. బొగ్గు బ్లాకుల వేలంపై మండిపడ్డ మంత్రి కేటిఆర్.. జంగ్సైరన్కు పిలుపునిచ్చారు. మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రాల్లో మహా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12న రామగుండంలో ఇచ్చిన మాటను ప్రధాని తప్పారని విమర్శించారు కేటీఆర్.
ఇవాళ హైదరాబాద్ ప్రధాని మోదీ వస్తుండటంతో బీఆర్ఎస్ మరో ప్రచార అస్త్రానికి తెరలేపింది. బీజేపీలోని కీలక నేతల వారసుల ఫోటోలతో హైదరాబాద్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కమలం పార్టీ నేతలు పరివారానికే పట్టం కడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ‘మీ పరివారం మీకు ఆహ్వానం పలుకుతోంది’ అంటూ సెటైరికల్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..