Big News Big Debate : తెలంగాణలో పొలిటికల్ మైండ్గేమ్ ఆడుతున్నదెవరు?
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... తెలంగాణలో ఓ కొత్త పొలిటికల్ గేమ్ మొదలైంది. బీఆర్ఎస్, బీజేపీ కలవబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారమే దీనికి ప్రధానకారణం. ఓవైపు నుంచి లీకులు, మరోవైపు ఖండనలు, ఇంకోవైపు నుంచి ఆరోపణలతో ... మొత్తానికి ఈ వ్యవహారం స్టేట్ పొలిటికల్ సినారియోకి ఘాటుమసాలా అద్దుతోంది.
తెలంగాణ రాజకీయం ఇప్పుడు సరికొత్త కథాచిత్రాన్ని తలపిస్తోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నండటంతో… వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. అందులో భాగంగానే పొత్తులపై జరుగుతున్న ప్రచారం హోరెత్తుతోంది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య పొత్తు ఉండొచ్చంటూ వస్తున్న ఊహాగానాలు హీటెక్కిస్తున్నాయి.
ఇటీవల, మీడియాతో చిట్చాట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు… మరింత వేడిపుట్టించాయి. బీజేపీతో బీఆర్ఎస్కు పొత్తు అవకాశం ఉందనీ.. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ మల్కాజ్గిరి సీటు తమ కుమారుడి కోసం భద్రంగా ఉంటుందనీ.. ఆఫ్ ది రికార్డ్ కీలక కామెంట్సే చేశారు. అయితే, తాజాగా ఈ విషయంపై స్పందించిన తెలంగాణ బీజేపీ నేతలు… ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్తో పొత్తు ఉండదని తేల్చేశారు. BRS, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలేనన్న కిషన్రెడ్డి… ఒంటరిగానే బరిలో ఉంటామన్నారు. కాళ్లబేరానికి వచ్చినా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబోమన్న లక్ష్మణ్.. ఈసారి గతంలో కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు.
ఒకరలా, మరొకరిలా మాట్లాడటం చూస్తుంటే… ఈ వ్యవహారం గందరగోళంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్,బీజేపీ ఒక్కటేనంటూ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి కొద్దోగొప్పో లబ్ధిపొందిన కాంగ్రెస్.. ఎంపీ ఎన్నికల్లో అదే స్ట్రాటజీ అమలు చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే, ఈ ప్రచారంతో మరోసారి దెబ్బతినకుండా… తెలంగాణ బీజేపీ నేతలు సైతం స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీఎన్నికల ఓటమి తర్వాత డీలాపడ్డ బీఆర్ఎస్.. తమనేతలు జారిపోకుండా ఉండేందుకే ఇలా పొత్తుప్రచారం చేస్తుందనేవారూ ఉన్నారు. మొత్తానికి తెలంగాణలో ప్రధానపార్టీలు వేటికవి పొలిటికల్ మైండ్గేమ్ మొదలెట్టేశాయని మాత్రం స్పష్టమవుతోంది. మరి, ఇదెవరికి లాభం? ఎవరికి నష్టం? అన్నది చూడాలి.