AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాండూరులో మరో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం, పోక్సో కేసు నమోదు!

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న దారుణాలు స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొన్న బషీరాబాద్ మండలం జీవంగిలో జరిగిన అత్యాచార ఘటన మరవకముందే, తాజాగా యాలాల మండలంలో మరో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరగడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు చిన్నారుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

తాండూరులో మరో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం, పోక్సో కేసు నమోదు!
Pocso Case Registered
Sravan Kumar B
| Edited By: |

Updated on: May 15, 2026 | 8:32 PM

Share

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న దారుణాలు స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొన్న బషీరాబాద్ మండలం జీవంగిలో జరిగిన అత్యాచార ఘటన మరవకముందే, తాజాగా యాలాల మండలంలో మరో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరగడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు చిన్నారుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. యాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన ఫరాన్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికపై గురువారం (మే 14) రాత్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఊహించని దారుణంతో దిగ్భ్రాంతికి గురైన బాలిక కుటుంబ సభ్యులు ఆలస్యం చేయకుండా వెంటనే యాలాల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదుపై యాలాల ఎస్సై విట్టల్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు. గంటల వ్యవధిలోనే నిందితుడు ఫరాన్‌ను గాలించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై విట్టల్ రెడ్డి ధృవీకరించారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.

తాండూరు ప్రాంతంలో వరుసగా మైనర్ బాలికలపై దాడులు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి ఘాతుకాలకు పాల్పడే వారికి సమాజంలో తిరుగాడే అర్హత లేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వీరికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరుతున్నారు.

మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు లేదా నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని వికారాబాద్ జిల్లా పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో, మారుతున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారికి రక్షణగా నిలవాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us