SLBC Tunnel Rescue: ఆ 40 మీటర్లే బిగ్ టాస్క్.. SLBC టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
నాలుగు రోజులు గడిచాయి.. నాన్స్టాప్గా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయినా.. SLBC సొరంగంలో చిక్కుకుపోయిన 8మంది కార్మికుల ఆచూకీ మాత్రం తెలియరాలేదు. డే అండ్ నైట్ రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నా.. స్పాట్కి ఎందుకు చేరుకోలేకపోతున్నారు? 40 మీటర్ల దూరంలోనే ఎందుకు ఆగిపోయారు? వాళ్లకు ఎదురవుతున్న ఆటంకాలేంటి?

రోజులు గడుస్తున్నాయి.. రెస్క్యూ ఆపరేషన్ సుదీర్ఘంగా కొనసాగుతోంది.. కానీ SLBC టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల జాడ మాత్రం కానరావడం లేదు. వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న సహాయక బృందాలు… నాలుగో రోజు రెస్క్యూలో భాగంగా.. స్పాట్కి 40 మీటర్ల దూరంలో ఆగిపోయాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో రోజుల తరబడి ఆపరేషన్ తర్వాత.. 40 మీటర్ల టాస్క్.. రెస్క్యూ సిబ్బందికి సవాల్ విసురుతోంది. ఆ.. 40 మీటర్ల దూరాన్ని ఎలా అధిగమిస్తారన్నదే … రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా మారింది. అటువైపు 8 మంది కార్మికులు.. ఇటువైపు సహాయక బృందాలు.. మధ్యలో 40 మీటర్ల మేర శకలాలు, బురద మేట.. వీటిని తొలగిస్తే ఆపరేషన్ క్లైమాక్స్కి చేరినట్టే… కార్మికుల జాడ దొరికినట్టే. అయితే ఈ కఠినమైన పరిస్థితిని అధిగమించడం ఎలా అన్నది బిగ్ టాస్క్గా కనిపిస్తోంది.
నీటి ఊటతో పెరుగుతున్న బురద మేట
40 మీటర్ల దూరం దాటి వెళ్లేందుకు సిబ్బందికి మూడు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొదటిది.. టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలు.. ఇవి మీటర్ల మేర పడిపోయాయి. భారీగా బరువు ఉండటంతో వాటిని బయటకు తీయడం కష్టమవుతోంది. ఇక రెండోది బురద మేట.. నీటి ఉటతో బురద అంతకంతకు పెరుగుతోంది. దాన్నంతా బయటకు తీయడం కూడా ఇబ్బందికరంగానే మారింది. ఇక మూడోది కన్వెయర్ బెల్డ్.. 12 కిలోమీటర్ల తర్వాత సిబ్బంది కాలినడకన స్పాట్కి వెళ్లేది కన్వెయర్ బెల్ట్పైనే. ఇది ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. అయితే.. కళ్ల ముందు జరిగిన ఘటన తల్చుకుంటూ ఇప్పటికీ భయంతో వణికిపోతున్నారు కార్మికులు. టీవీ9తో మాట్లాడిన ప్రత్యక్ష సాక్షి.. ఆ రోజు ఏం జరిగిందో కళ్లకుకట్టారు.
కార్మికుల్ని గుర్తించేందుకు ర్యాట్ హోల్ టీమ్ సేవలు
40 మీటర్లమేర పేరుకుపోయిన బురద మేట.. టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలు ఎంత వేగంగా బయటకు పంపిస్తే అంత త్వరగా కార్మికుల్ని గుర్తించే వీలుంటుంది. ఈ ప్రక్రియను చాలా త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో రెస్క్యూ సిబ్బంది ముందుకెళ్తోంది. మరోవైపు సొరంగంలో కార్మికుల్ని గుర్తించేందుకు స్నీపర్ డాగ్, ర్యాట్ హోల్ టీమ్ సేవల్ని ఉపయోగిస్తున్నారు. ఇక రోజులు గడుస్తున్నా కొద్దీ బాధిత కుటుంబాల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఒక్కొక్కరుగా ఎల్ఎల్బీసీ ప్రాంతానికి చేరుకుని.. తమ వాళ్ల ఆచూకీపై ఆరాతీస్తుండటం గుండెల్లి బరువెక్కిస్తోంది.
ముందుకెళ్లలేని పరిస్థితి..
మధ్యాహ్నం డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలు, వాకీటాకి లాంటి సిగ్నల్ ఎక్విప్మెంట్స్తో సిబ్బంది సొరంగంలోకి వెళ్లింది. దాదాపు 200 మీటర్ల మేర బురద కూరుకుపోయింది. అలాగే నీళ్లు నిలిచి ఉండటంతో రెస్క్యూ సిబ్బంది ముందుకెళ్లలేని పరిస్థితి. సొరంగంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ విరిగిన భాగాలు, బురదను బయటకు పంపేందుకు సహాయ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
