కొంపముంచిన పానీపూరీ సరదా.. 15 మందికి తీవ్ర అస్వస్థత! ఆ తర్వాత
పానీపూరి బండి వద్ద పానీ పూరి తిన్న పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో విద్యార్థులు సహా సుమారు 15 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన అయిజ మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది..

హైదరాబాద్, మే 27: పానీపూరి అంటే ప్రాణం పెట్టేవాళ్లు చాలామందే ఉంటారు. సాయంత్రం వేళల్లో పానీ పూరీ దుఖాణాల వద్ద జనాలు బారులు తీరి ఉండటమే అందుకు నిదర్శనం. మీరూ కూడా ఆ కోవకే చెందుతారా? అయితే మీకీ విషయం చెప్పాల్సిందే. బయట వీధి చివర దుఖానాల్లో లభించే పానీ పూరీలో శుభ్రత శూన్యం, తింటే రోగాలు వస్తాయని ఎంత చెప్పినా వినిపించుకోని వారికి ఈ వార్త షాక్కు గురి చేస్తుంది. నిన్న మంగళవారం సాయంత్రం ఓ దుఖానం వద్ద పానీ పూరీ తిని ఏకంగా 15 మంది తీవ్ర అశ్వస్థతకు గురయ్యారు. ఈ ఘటప జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో మంగళవారం సాయంత్రం ఓ దుకాణం వద్ద కొంతమంది విద్యార్ధులు పానీపూరి తినాలని బండి వద్దకు వెళ్లారు. పానీ పూరీ తిని అందరూ వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో పానీ పూరీ తిన్న వారంతా ఒక్కొక్కరికి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. బాధితులంతా ఒకే దుకాణంలో పానీ పూరీ తినడంతో ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని భావించారు. కలుషిత నీరు, నాణ్యతలేని పదార్థాలతో పానీపూరి తయారు చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 15 మంది ఆస్పత్రిలో చేరారు.
వీరిలో మిగిలిన అందరినీ ఇళ్లకు పంపించగా.. భవిత, ప్రసన్నతార, అశ్విని కుమారి, సుచిత, మణికుమారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీరికి పానీ పూరీ అమ్మిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బండిని ఠాణాకు తరలించారు. శాంపిల్స్ ల్యాబ్కి పంపిచామని అన్నారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై మల్లేశ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




