అర్ధరాత్రి ఆలయ ప్రాంగణం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు.. ఫిర్యాదులో పోలీసులు వెళ్లి చూడగా
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలోని మారెమ్మతల్లి ఆలయంలో గుప్తనిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు చేపట్టిన ఘటనను పోలీసులు భగ్నం చేశారు. ఘటనలో 11 మందిని అదుపులోకి తీసుకుని సెల్ఫోన్లు, బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ పూజారితో పాటు మరికొందరి పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామ శివారులోని మారెమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో అర్ధరాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, శనివారం అర్ధరాత్రి విశ్వసనీయ సమాచారం అందడంతో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు వి.ఎం. బంజర ఎస్సై వెంకటేష్ నేతృత్వంలోని బృందం ఆలయం వద్ద నిఘా ఏర్పాటు చేసింది. తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించగా, ఓ ముఠా భారీ లోతులో గొయ్యి తవ్వుతూ కనిపించింది.
విచారణలో, తాము గుంటూరు, ఎన్కూరు ప్రాంతాల నుంచి కూలీలుగా వచ్చామని, ఆలయ పూజారి సూచన మేరకు గుప్తనిధుల కోసం లోతుగా తవ్వుతున్నామని వారు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తవ్వకాల సమయంలో భారీ బండరాయి అడ్డం రావడంతో డ్రిల్ మిషన్ను కూడా ఉపయోగించినట్లు వెల్లడించారు. అలాగే, పని నిలిపివేయాలని చెప్పినప్పుడు పూజారి పూజలు చేశానని, పని పూర్తి చేయకపోతే ప్రాణాపాయం ఉంటుందని బెదిరించినట్లు కూలీలు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 11 సెల్ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఆలయ పూజారితో పాటు ఆయన మేనల్లుడి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
