జైస్వాల్నే కాదు వైభవ్ని కూడా శిక్షించాల్సిందే.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..!
Yashasvi Jaiswal Controversy: యశస్వి జైస్వాల్, శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో మధ్య రెండవ టెస్టులో చోటుచేసుకున్న ఘర్షణపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్ విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

Yashasvi Jaiswal Controversy: కొలంబోలో జరుగుతున్న 2వ టెస్ట్ తొలి రోజు టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్, అసిత ఫెర్నాండో మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఫెర్నాండో బౌలింగ్లో జైస్వాల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జైస్వాల్ అతడి వైపు వెళ్లగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఫెర్నాండో తన తలను జైస్వాల్ వైపు కదిలించాడు. జైస్వాల్ కూడా ముందుకు వంగడంతో ఇద్దరి తలలు తాకాయి. ఘటనపై ఐసీసీ చర్యలు తీసుకుని ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఒక్కొక్కరికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది.
మంజ్రేకర్ మాత్రం ఈ శిక్ష సరిపోదని అభిప్రాయపడ్డారు. మైదానంలో శారీరకంగా తాకడం వంటి ఘటనలకు కఠినమైన చర్యలు అవసరమని ఆయన సూచించారు.
వైభవ్ సూర్యవంశీ ఘటనను గుర్తుచేసిన మంజ్రేకర్..
ఈ సందర్భంగా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన గత ఘటనను మంజ్రేకర్ ప్రస్తావించారు. ఈ ఏడాది జరిగిన ఏ జట్ల ట్రై-సిరీస్లో భారత్ ఏ తరపున ఆడిన వైభవ్.. శ్రీలంక ఏ ఆటగాళ్లతో ఘర్షణకు దిగిన ఘటనను ఆయన గుర్తుచేశారు.
ఐసీసీ, బీసీసీఐ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంజ్రేకర్ కోరారు. యువ ఆటగాళ్లకు ఇటువంటి ప్రవర్తనను ఉపేక్షించడం సరైన సందేశం కాదని ఆయన పేర్కొన్నారు.
ఇలా వదిలేస్తే మళ్లీ జరుగుతాయి..
ఎక్స్లో మంజ్రేకర్ స్పందిస్తూ ఐసీసీ, బీసీసీఐని ఉద్దేశించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “వైభవ్ ఫర్ ఇండియా ఏ ఇటీవల.. ఇప్పుడు జైస్వాల్.. ఇలాంటి ప్రవర్తన నుంచి తప్పించుకునేలా చేస్తే, అదే ప్రవర్తనను మళ్లీ చేయడానికి వారికి అలవాటు పడేలా చేసినట్టే” అని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు క్రీడకు మంచిది కాదని, ఆటగాళ్ల భవిష్యత్తుపైనా ప్రభావం చూపొచ్చని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. శారీరక ఘర్షణలు జరిగినప్పుడు కఠినమైన శిక్షలు ఉండాలని ఆయన సూచించాడు.
జైస్వాల్ ఏమన్నాడంటే..?
రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు జైస్వాల్ తన చర్యను సమర్థించుకున్నాడు. “అతను ఏం అన్నాడో మీకు తెలియకపోతే తీర్పు ఇవ్వొద్దు. ఎవరైనా హద్దు దాటితే వారికి తెలియజేయాలి. ఇది భారత్.. మేం పోరాడతాం, సమాధానం ఇస్తాం” అని చెప్పుకొచ్చాడు.
జైస్వాల్, ఫెర్నాండోలకు జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్లు పడినా, మంజ్రేకర్ మాత్రం మరింత కఠిన చర్యల అవసరాన్ని ముందుకు తెచ్చారు. వైభవ్ సూర్యవంశీ ఘటనను కలిపి చూస్తే, యువ ఆటగాళ్ల ప్రవర్తనపై క్రికెట్ బోర్డులు ఎలాంటి సందేశం ఇవ్వాలన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




