ఒక్కో పరుగుకు రూ. 14 వేలు.. దటీజ్ బుడ్డోడి బ్రాండ్ వాల్యూ.. అసలు లెక్కలు చూసే ధైర్యముందా..!
Vaibhav Suryavanshi Brand Value: ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ అంచనా ఆస్తి విలువ సుమారు రూ. 3 కోట్లుగా భావిస్తున్నారు. త్వరలోనే భారత జట్టులో స్థానం దక్కితే భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక ఒప్పందం ద్వారా అతని ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. మైదానంలో బ్యాట్ ఎత్తి గెలుపు పిలుపునిస్తున్న ఈ యువ కిరణం, రానున్న రోజుల్లో భారత క్రికెట్లోనే అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన టాప్ క్రీడాకారుల్లో ఒకరిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Vaibhav Suryavanshi Brand Value: భారత క్రికెట్ చరిత్రలోనే సరికొత్త సంచలనం నమోదైంది. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ బరిలోకి దిగి, తన అద్భుత బ్యాటింగ్తో దేశవ్యాప్త అభిమానుల మనసులు గెలుచుకున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. మైదానంలో పరుగుల వరద పారించడమే కాదు, మార్కెట్ ప్రపంచంలోనూ తన బ్రాండ్ విలువను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
పరుగుల వేటలో ‘ఆరెంజ్ క్యాప్’ వీరుడు..
రాజస్థాన్ రాయల్స్ తరపున ఈ సీజన్లో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆడిన 16 మ్యాచుల్లో ఏకంగా 776 పరుగులు సాధించి, ఈ సీజన్ ‘ఆరెంజ్ క్యాప్’ను కైవసం చేసుకోవడమే కాకుండా ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి రూ. 1.10 కోట్లు అందుకుంటున్న వైభవ్ చేసిన పరుగుల లెక్కను చూస్తే.. మైదానంలో అతను చేసిన ఒక్కో పరుగుకు దాదాపు రూ. 14 వేల ఆదాయం లభిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత మార్కెట్లో అతని బ్రాండ్ విలువ ఊహించని రీతిలో పెరిగిపోయింది.
రూ. 2 కోట్ల వరకు పెరిగిన ఎండార్స్మెంట్ ఫీజు..
ప్రస్తుతం మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న యువ క్రీడాకారుడిగా వైభవ్ నిలిచాడు. నిన్నమొన్నటి వరకు సాధారణంగా ఉన్న అతని బ్రాండ్ విలువ ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరింది. ప్రస్తుతం ఒక్కో ప్రకటన ఒప్పందానికి వైభవ్ రూ. 50 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. మున్ముందు ఈ విలువ మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదికూడా చదవండి: ఇంగ్లాండ్తో రెండో టీ20 సమరం.. టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
మైనర్ కావడంతో బ్రాండ్లకు చట్టపరమైన అడ్డంకులు..
వైభవ్ సూర్యవంశీ టాలెంట్కు బ్రాండ్లు క్యూ కడుతున్నప్పటికీ, అతని వయసు కేవలం 15 సంవత్సరాలు (మైనర్) కావడం వల్ల కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారత చట్టాల ప్రకారం 18 ఏళ్లు నిండకపోతే డ్రైవింగ్ లైసెన్స్ పొందడం సాధ్యం కాదు. దీంతో వాహనాల ప్రకటనల్లో అతన్ని చూపించడం చట్టపరంగా ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉందని కంపెనీలు భావిస్తున్నాయి. అలాగే పెద్దల కోసం ఉద్దేశించిన గ్రూమింగ్ ఉత్పత్తులు, లగ్జరీ వస్తువులు, ఫాంటసీ గేమింగ్, ఆర్థిక సేవలకు సంబంధించిన ప్రకటనల్లో కూడా మైనర్లను ఉపయోగించడంపై పరిమితులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పలు ప్రముఖ ఆటోమొబైల్, లైఫ్స్టైల్ బ్రాండ్లు అతనితో ఒప్పందాలు చేసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నాయి. ఫలితంగా కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. గతంలో మాదిరిగా దీర్ఘకాలిక ఒప్పందాల కంటే ప్రస్తుతం రెండేళ్ల నుంచి మూడేళ్ల స్వల్పకాలిక ఒప్పందాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
వయసుకు తగ్గ బ్రాండ్ల ఎంపికపైనే మొగ్గు..
ఇలాంటి పరిమితులు ఉన్నప్పటికీ స్పోర్ట్స్ డ్రింక్స్, క్రికెట్ సామగ్రి, న్యూట్రిషన్ ఉత్పత్తులు, స్పోర్ట్స్ షూ బ్రాండ్లు మాత్రం వైభవ్తో ఒప్పందాలకు విపరీతమైన ఆసక్తి చూపుతున్నాయి. మరోవైపు అతని కుటుంబం, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కూడా అతన్ని అధిక వాణిజ్య ప్రచారాలకు దూరంగా ఉంచుతూ, వయసుకు తగిన బ్రాండ్లను మాత్రమే ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
