Rohit Sharma : వాంఖడే స్టేడియంలో ఆ రాత్రి ఏం జరిగింది? గంభీర్కు రోహిత్ ఇచ్చిన ఆఫర్ ఏంటి?
Rohit Sharma : లార్డ్స్ వన్డేతో రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వార్తలు హాట్ టాపిక్గా మారాయి. వాంఖడే స్టేడియంలో గౌతమ్ గంభీర్కు రోహిత్ చేసిన ఆఫర్, అజిత్ అగార్కర్తో విభేదాలు, రిటైర్మెంట్ వెనుక అసలు కారణాలపై ఆసక్తికర వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

Rohit Sharma : భారత క్రికెట్ జట్టులో దాదాపు 19 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగుతూ, ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు గుడ్బై చెప్పిన రోహిత్ ఇప్పుడు వన్డే క్రికెట్కు కూడా దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. జూలై 19న ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో వన్డే మ్యాచ్ హిట్ మ్యాన్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందని సమాచారం. గత కొంతకాలంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్లతో రోహిత్కు వచ్చిన విభేదాలే ఇందుకు కారణమని ఇన్సైడ్ టాక్.
అగార్కర్, గంభీర్లతో పెరిగిన తీవ్ర నమ్మకరాహిత్యం
అంతర్జాతీయ క్రికెట్లో 513 మ్యాచ్లు ఆడి, 20 వేలకు పైగా పరుగులు, 50 సెంచరీలు చేసిన రోహిత్ శర్మకు తన కెరీర్ ముగింపుపై సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. కానీ 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. దీనికి కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కూడా ఉంది. గతంలో రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడు రోహిత్, అగార్కర్ మధ్య మంచి బంధం ఉండేది. ద్రావిడ్ వెళ్ళిపోయి గంభీర్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇది ఒకప్పుడు సౌరవ్ గంగూలీ, గ్రెగ్ చాపెల్ మధ్య జరిగిన వివాదాన్ని తలపిస్తోంది.
వాంఖడే స్టేడియంలో ఆ రాత్రి ఏం జరిగింది?
ఐపీఎల్ 2024 సమయంలో వాంఖడే స్టేడియంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత, టీమిండియా తదుపరి కోచ్గా గంభీర్ వస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ రోహిత్ స్వయంగా గంభీర్ దగ్గరకు వెళ్లాడు. “గౌతీ భాయ్, ఇండియన్ టీమ్ కోచ్గా వచ్చేయ్” అని రోహిత్ అడిగాడట. దానికి గంభీర్ స్పందిస్తూ.. “నువ్వు కెప్టెన్గా ఉంటే కచ్చితంగా వస్తాను” అని సమాధానమిచ్చాడు. అప్పట్లోనే ద్రావిడ్ శైలికి అలవాటు పడిన రోహిత్కు గంభీర్తో పని చేయడం కష్టమని కొందరు హెచ్చరించారు. అనుకున్నట్లుగానే ఆ తర్వాత ఇద్దరి మధ్య బంధం చెడిపోయింది.
న్యూజిలాండ్ సిరీస్తో మొదలైన ముఠా తగాదాలు
స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ 0-3తో ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి రోహిత్, గంభీర్, అగార్కర్ల మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఇది మరింత ముదిరింది. జనవరి 2న సిడ్నీ టెస్టుకు ముందు ప్రాక్టీస్ సెషన్లో వీరి మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఫామ్లో లేని కారణంగా తాను తప్పుకుంటానని రోహిత్ చెప్పగా, ఇంగ్లాండ్ సిరీస్ సెలక్షన్ సమస్య అవుతుందని అగార్కర్ వద్దు అన్నాడు. కానీ, సెలక్టర్లకు షాక్ ఇస్తూ మరుసటి రోజే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. “నేను ఇద్దరు పిల్లల తండ్రిని, నాకేది మంచిదో నాకు తెలుసు” అంటూ రోహిత్ ఇచ్చిన ఇంటర్వ్యూతో గంభీర్, అగార్కర్ ఇద్దరూ షాక్కు గురయ్యారు.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించినా కెప్టెన్సీ నుంచి తొలగింపు
ఆ తర్వాత దుబాయ్లో న్యూజిలాండ్పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ అందించినప్పటికీ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుండి తొలగించడం అతని మనోస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇంగ్లాండ్ టూర్ సెలక్షన్కు ముందు రోహిత్ కేవలం రెండు మ్యాచ్లే ఆడతాడని సెలక్టర్లు ప్రచారం చేయగా, రోహిత్ వర్గం మాత్రం తాను 5 మ్యాచ్లు ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. చివరికి 2027 వరల్డ్ కప్ ప్లాన్స్ చెప్తూ అగార్కర్, గంభీర్ ఇద్దరూ కలిసి రోహిత్ను పక్కన పెట్టాలని నిర్ణయించారు. టీమ్ మేనేజ్మెంట్ నుంచి సరైన సపోర్ట్, కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో రోహిత్ సరిగ్గా స్కోర్ చేయలేకపోయాడని, తీవ్ర మనస్తాపంతోనే అతను లార్డ్స్ వేదికగా వన్డేలకు కూడా వీడ్కోలు పలకాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
