ముంబై ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు.. ప్రత్యర్థులకు ఇక దబిడ దిబిడే
Rohit Sharma Injury Update: ముంబై ఇండియన్స్ అభిమానులకు తీపి కబురు అందింది. గత మూడు మ్యాచ్లుగా మైదానానికి దూరమైన స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరగబోయే కీలక పోరుకు ముందు రోహిత్ సాధనలో వేగం పెంచడం, జట్టు విజయావకాశాలపై ఆశలు చిగురింపజేస్తోంది. రోహిత్ రాకతో ముంబై మళ్లీ విజయపథంలోకి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Rohit Sharma Comeback: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మకు కండరాల గాయం (హాంస్ట్రింగ్) అయింది. ఈ గాయం కారణంగా అతను పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్తో పాటు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. అయితే, తాజా నివేదికల ప్రకారం రోహిత్ ఇప్పుడు ఎటువంటి నొప్పి లేకుండా పూర్తిస్థాయిలో సాధన చేస్తున్నాడు. జిమ్లో గడపడంతో పాటు నెట్స్లో కూడా తీవ్రంగా శ్రమిస్తుండటం ఫిజియోలలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
శిక్షణలో పెరిగిన తీవ్రత..
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఓటమి పాలైన తర్వాత జరిగిన ఐచ్ఛిక శిక్షణా శిబిరంలో రోహిత్ శర్మ చురుగ్గా పాల్గొన్నాడు. తనదైన శైలిలో భారీ షాట్లు ఆడుతూ మంచి లయలో కనిపించాడు. ఈ శిక్షణలో అతనితో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా పాల్గొన్నారు. బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే తదుపరి మ్యాచ్కు రోహిత్ అందుబాటులో ఉండే అవకాశాలు నూటికి నూరు శాతం కనిపిస్తున్నాయి.
ముంబై ఓపెనింగ్ కష్టాలు..
రోహిత్ లేని సమయంలో ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ స్థానం కోసం అనేక ప్రయోగాలు చేసింది. క్వింటన్ డి కాక్ అద్భుతమైన సెంచరీతో రాణించినప్పటికీ, మరో ఓపెనర్ ఎంపికలో జట్టు తడబడింది. యువ ఆటగాడు డానిష్ మలేవర్కు అవకాశం ఇచ్చినప్పటికీ, అతను గత రెండు మ్యాచ్ల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. రోహిత్ తిరిగి జట్టులోకి వస్తే ఓపెనింగ్ సమస్య తీరడమే కాకుండా, బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుంది.
పాయింట్ల పట్టికలో ముంబై పరిస్థితి..
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గాయపడటానికి ముందు రోహిత్ శర్మ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పుడు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ముంబైకి ప్రతి మ్యాచ్ కీలకమే. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ రాక జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.
