IPL 2024: గిల్, కోహ్లీ కాదు.. ఈసారి ఆ ప్లేయర్కే ఆరెంజ్ క్యాప్.. జోస్యం చెప్పిన విరాట్ ఫ్రెండ్..
ఇటీవల ఓ స్పోర్ట్స్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు రాబోయే ఐపీఎల్ 2024 అంచనాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి సొంతమవుతుందని.. అతడ్ని అడగ్గా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు అరుదైన రికార్డు ఉంది. ఇటీవల ఓ స్పోర్ట్స్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు రాబోయే ఐపీఎల్ 2024 అంచనాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి సొంతమవుతుందని.. అతడ్ని అడగ్గా.. విరాట్ కోహ్లీ, శుభ్మాన్ గిల్ కాదు.. ఈసారి టీమిండియా యువ సంచలనం, రాయల్స్ ఓపెనర్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలుస్తాడని అన్నాడు చాహల్. గిల్, కోహ్లీలను కాకుండా చాహల్ తన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఇద్దరు ప్లేయర్స్ను ఆరెంజ్ క్యాప్కు ఎంపిక చేయడం గమనార్హం.
ఐపీఎల్ 2024లో యశస్వి జైస్వాల్ లేదా జోస్ బట్లర్లలో ఒకరు ఆరెంజ్ క్యాప్ గెలుస్తారని చాహల్ అంచనా వేస్తున్నాడు. 2022 సీజన్లో ఇంగ్లాండ్ వైట్బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ సంవత్సరం బట్లర్ 17 మ్యాచ్ల్లో 863 పరుగులు చేశాడు. అలాగే ఇటీవల కాలంలో జైస్వాల్ రెడ్హాట్ ఫామ్లో ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్లోనూ జైస్వాల్ మెరుపులు మెరిపించాడు. 14 మ్యాచ్లలో 624 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఒక్క ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఇక ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అతడి ఫామ్ను చూస్తే, కచ్చితంగా ఆరెంజ్ క్యాప్ కోసం ముందు వరుసలో జైస్వాల్ ఉన్నాడని చెప్పొచ్చు.
అటు పర్పుల్ క్యాప్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గెలుచుకుంటాడని అంచనా వేశాడు చాహల్. ఈ సీజన్లో రషీద్ గుజరాత్ టైటాన్స్ తరపున బరిలోకి దిగుతున్నాడు. అలాగే గతేడాది జరిగిన ఐపీఎల్ 2023 ఎడిషన్లో, ఈ 25 ఏళ్ల క్రికెటర్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహించి 17 మ్యాచ్లలో 27 వికెట్లు తీశాడు. కాగా, ఐపీఎల్ 2024 ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడనున్నాయి.
