AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు మారిన ఐపీఎల్ ఫైనల్.. కట్‌చేస్తే.. కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రకటన..!

IPL 2026 Final Venue Shift: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు మారుస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ స్పందిస్తూ, టిక్కెట్ల కేటాయింపు వివాదానికి దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు మారిన ఐపీఎల్ ఫైనల్.. కట్‌చేస్తే.. కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రకటన..!
Chinnaswamy Stadium
Venkata Chari
|

Updated on: May 07, 2026 | 1:08 PM

Share

IPL 2026 Final Venue Shift: ఐపీఎల్ నిబంధనల ప్రకారం గతేడాది విజేతగా నిలిచిన జట్టు సొంత మైదానంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం ఆనవాయితీ. ఆ లెక్కన ఈసారి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, తాజాగా బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్‌లో ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి తరలించినట్లు ప్రకటించింది. గత ఏడాది స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియం దాదాపు ఏడాది పాటు మూతపడటం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణమని భావిస్తున్నారు.

బీసీసీఐ వివరణ, రాజకీయ కోణం..

షెడ్యూల్ మార్పుపై బీసీసీఐ ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. స్థానిక అసోసియేషన్, అధికారులు కోరిన కొన్ని నిబంధనలు బీసీసీఐ ప్రోటోకాల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే వేదికను మార్చాల్సి వచ్చిందని బోర్డు పేర్కొంది. దీని వెనుక కర్ణాటకలోని రాజకీయ జోక్యం ఉందనే సంకేతాలను బోర్డు పరోక్షంగా ఇచ్చింది. క్వాలిఫైయర్ 1 ధర్మశాలలో, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 చండీగఢ్‌లో జరగనుండగా, మే 31న జరిగే గ్రాండ్ ఫైనల్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది.

డీకే శివకుమార్ స్పందన..

ఈ వివాదంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ వివరణ ఇచ్చారు. రాజకీయ నాయకుల కోసం అడిగిన వి.ఐ.పి టిక్కెట్ల డిమాండ్ల వల్లే వేదిక మారిందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అహ్మదాబాద్ స్టేడియం సామర్థ్యం పెద్దది కావడం వల్లే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఎమ్మెల్యేలకు ఉచిత టిక్కెట్ల కేటాయింపుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులకు 50 నుంచి 60 శాతం టిక్కెట్లు ఇస్తారని, తమ రాష్ట్రంలో జోక్యం చాలా తక్కువని ఆయన సమర్థించుకున్నారు.

మారిన ఐపీఎల్ సంప్రదాయం..

2022 వరకు డిఫెండింగ్ ఛాంపియన్ల నగరంలోనే ఫైనల్ జరిగేది. కానీ కరోనా తర్వాత ఈ సంప్రదాయం మారుతూ వస్తోంది. అహ్మదాబాద్‌లోని అతిపెద్ద స్టేడియం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కీలక మ్యాచ్‌లు అక్కడికే తరలుతున్నాయి. చిన్నస్వామి స్టేడియం నిర్వహణ లోపాలు, టిక్కెట్ల పంపిణీలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బెంగళూరు అభిమానులు ఈసారి తమ నగరంలో ఫైనల్ చూసే అవకాశాన్ని కోల్పోయారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us