
IPL Sponsorship Revenue: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన లీగ్గా ఐపీఎల్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. తాజాగా విడుదలైన 2025-26 నివేదికల ప్రకారం, ఐపీఎల్ ఫ్రాంచైజీలు కేవలం స్పాన్సర్షిప్ డీల్స్ ద్వారానే వెయ్యి కోట్ల రూపాయల మార్కును అధిగమించాయి. ఈ స్థాయిలో ఆదాయం ఆర్జించడం ఇతర దేశాల లీగ్లకు, ముఖ్యంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) వంటి వాటికి అందనంత ఎత్తులో ఉంది. కేవలం టికెట్ల అమ్మకాలపైనే ఆధారపడకుండా, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో జట్లు భారీగా లాభాలను గడిస్తున్నాయి.
ఒకప్పుడు ఫాంటసీ గేమింగ్ కంపెనీలు ఐపీఎల్ జట్లపై భారీగా పెట్టుబడులు పెట్టేవి. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల కొన్ని గేమింగ్ కంపెనీల ప్రాబల్యం తగ్గింది. అయినప్పటికీ, ఇతర రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు క్రికెట్ క్రేజ్ను వాడుకోవడానికి క్యూ కడుతున్నాయి. దీనివల్ల జట్ల ఆదాయ వనరులు మరింత విస్తృతమయ్యాయి.
ఐపీఎల్ ఆదాయంలో అన్ని జట్లు సమానంగా లేవు. జనాదరణ, బ్రాండ్ విలువ ఆధారంగా మూడు జట్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి:
ముంబై ఇండియన్స్ (MI)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
ఈ మూడు జట్ల స్పాన్సర్షిప్ విలువ ఒక్కొక్కటి సుమారు రూ. 150 కోట్ల వరకు ఉంది. వీటి తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో నిలిచాయి. మిగిలిన జట్లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన ఫ్రాంచైజీగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. దీనికి ప్రధాన కారణం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. కోహ్లీకి ఉన్న అంతర్జాతీయ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ జట్టుకు వరంగా మారింది. దీనికి తోడు, 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ను గెలవడం ఆ జట్టు బ్రాండ్ వాల్యూను ఆకాశానికి చేర్చింది. ఛాంపియన్ హోదాలో 2026 బరిలోకి దిగుతుండటంతో స్పాన్సర్లు ఈ జట్టుపై కోట్లు కుమ్మరిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..