india vs australia : మరోసారి క్వారంటైన్ మావల్ల కాదు.. స్పష్టం చేసిన టీమిండియా..
ఆసీస్- భారత్ మధ్య జరుగుతున్నటెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇక మూడు టెస్ట్ పై ఇప్పటికే సందిగ్దత నెలకొంది. భారత్ ఆటగాళ్లు నిబంధనలు ఉల్లంగించి రెస్టారెంట్..
india vs australia : ఆసీస్- భారత్ మధ్య జరుగుతున్నటెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇక మూడు టెస్ట్ పై ఇప్పటికే సందిగ్దత నెలకొంది. భారత్ ఆటగాళ్లు నిబంధనలు ఉల్లంగించి రెస్టారెంట్ కు వెళ్లడంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. మెల్బోర్న్ లోని ఓ రెస్టారెంట్ లో డిన్నర్ కు సంభంధించిన బిల్ ను ఓ అభిమాని కట్టడం, దానికి రిషబ్ పంత్ అతన్ని కౌగిలించుకోవడంతో బయోబబుల్ ఆంక్షల ఉల్లంఘన చేశారన్న ఆరోపణలతో టీమిండియా చెందిన ఐదుగురు ఆటగాళ్లను శనివారం ఐసోలేషన్ కు పంపారు. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టు జరగనున్న బ్రిస్బేన్ కు వెళ్లడానికి టీమిండియా సిద్ధం లేదని తెలుస్తోంది. బ్రిస్బేన్లో ఈ నెల 15 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుండగా, 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు ప్రారంభం కానుంది. అయితే, నాలుగో టెస్టును కూడా సిడ్నీలో నిర్వహించాలని భారత జట్టు కోరుతోంది. భారత ఆటగాళ్లు బయో సెక్యూరిటీ ప్రొటోకాల్స్ను ఉల్లంఘించి బయటకు వెళ్లినట్టు ఆరోపణలు రావడంతో బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా కలిసి దర్యాప్తు ప్రారంభించాయి.
ఇక క్వీన్స్ల్యాండ్లో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తమ రాష్ట్ర సరిహద్దులను మూసేసింది అక్కడి ప్రభుత్వం. ఇండియా, ఆస్ట్రేలియా ప్లేయర్స్ చార్టర్డ్ విమానాల్లో అక్కడికి వెళ్లనున్నారు. ముందస్తుగా ఐసోలేషన్ లో ఉన్న ఐదుగురు ఆటగాళ్లతో సహా మొత్తం భారత జట్టు సోమవారం అదే చార్టర్డ్ విమానంలో మూడవ టెస్ట్ కోసం సిడ్నీకి వెళ్తుంది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ షుబ్మాన్ గిల్, స్టంపర్ రిషబ్ పంత్, పేసర్ నవదీప్ సైని, బ్యాట్స్ మాన్ పృథ్వీ షా అనే ఐదుగురు ఆటగాళ్ళు బయో సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉల్లంఘనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ జట్టుతో ప్రయాణించడాన్ని అంగీకరించారు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించారు. “సోషల్ మీడియాలో ఒక ఆటగాడిని (రిషబ్ పంత్) కౌగిలించుకోవడం గురించి అభిమాని అబద్దం చెప్పకపోతే, ఈ గందరగోళం జరిగేది కాదు. మొదట అబద్దం చెప్పి, ఆపై తన చెప్పిన దాన్ని ఉపసంహరించుకున్న ఆ వ్యక్తి వీడియో ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంటుందని ఆ అధికారి తెలిపారు. అయితే బ్రిస్బేన్కు వెళ్లిన తర్వాత ప్రాక్టీస్, మ్యాచ్ల సందర్భంగానే టీమ్స్ బయటకు రావాలని, మిగతా సమయం మొత్తం హోటల్ రూమ్లకే పరిమితం కావాలని ఆస్ట్రేలియా టీమ్కు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే టీమ్ ఇండియాకు అలాంటి ఆదేశాలు ఏమి జరీ కానప్పటికీ క్వారంటైన్ తమ వల్ల కాదని ఆ బీసీసీఐ అధికారి తెలిపారు. దుబాయ్లో, అడిలైడ్లో కలిపి మొత్తం 28 రోజులు క్వారంటైన్ ఉన్నామని, మరొకసారి అంటే చాలా కష్టమని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే టీమిండియాతో నాలుగో టెస్ట్ను బ్రిస్బేన్ వేదికగా ఆడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అన్నాడు. క్వారంటైన్ ఉన్నా కూడా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. దీనికోసం కొన్ని త్యాగాలకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు.