AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు.. ఆర్‌సీబీ, ఢిల్లీ ప్లేయర్లదే హవా.. ముంబై నుంచి ఇద్దరే..!

India's T20 World Cup Squad: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత మహిళా జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రదర్శన ఆధారంగా ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు పెద్దపీట వేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు.. ఆర్‌సీబీ, ఢిల్లీ ప్లేయర్లదే హవా.. ముంబై నుంచి ఇద్దరే..!
Team India
Venkata Chari
|

Updated on: May 03, 2026 | 9:22 PM

Share

India’s T20 World Cup Squad: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక మహిళా టీ20 ప్రపంచకప్ కోసం భారత సెలెక్షన్ కమిటీ సమతుల్యమైన జట్టును ఎంపిక చేసింది. జట్టు పగ్గాలను అనుభవజ్ఞురాలు హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అప్పగించగా, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా నియమించారు. 2025లో సాధించిన విజయాలను ఈ మెగా టోర్నీలోనూ పునరావృతం చేయాలని టీమ్ ఇండియా పట్టుదలతో ఉంది.

ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి నలుగురు చొప్పున ఎంపిక..

ఈసారి జట్టు ఎంపికలో డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) నుంచి నలుగురు చొప్పున ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారు.

ఆర్‌సీబీ కోటా: స్మృతి మంధాన, రిచా ఘోష్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్.

ఢిల్లీ క్యాపిటల్స్ కోటా: షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, శ్రీ చరణి, నందిని శర్మ.

సెలెక్టర్లు, కెప్టెన్ ఈ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌పై పూర్తి నమ్మకం ఉంచారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో శ్రేయాంక పాటిల్ బౌలింగ్, మిడిల్ ఓవర్లలో జెమిమా బ్యాటింగ్ జట్టుకు వెన్నెముకగా నిలవనున్నాయి.

ముంబై ఇండియన్స్ నుంచి ఇద్దరికే చోటు..

ఆశ్చర్యకరంగా, బలమైన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నుంచి కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఎంపికయ్యారు. వారు జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా. యస్తికా ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తుండటంతో సెలెక్షన్ కమిటీ ఆమెకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధాన వికెట్ కీపర్‌గా రిచా ఘోష్ ఉండగా, యస్తికా అదనపు బ్యాటింగ్ బలాన్ని ఇస్తుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

జట్టు నుంచి ఇద్దరు స్టార్ల అవుట్..

ప్రస్తుత ఫామ్, జట్టు కాంబినేషన్ దృష్ట్యా హర్లీన్ డియోల్, అమన్జోత్ కౌర్‌లను జట్టు నుంచి తప్పించారు. దీనిపై కెప్టెన్ స్పందిస్తూ.. “వీరిద్దరూ గొప్ప ఆటగాళ్లే, గతంలో భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు. కానీ ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీలలో నిర్దిష్టమైన కాంబినేషన్ అవసరం. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చాం. ఇది వారి కెరీర్ ముగింపు కాదు, మా బెంచ్ స్ట్రెంత్ ఎంత బలంగా ఉందో ఇది నిరూపిస్తోంది” అని వివరించారు.

భారత్ ఫైనల్ స్క్వాడ్ ఇదే (India’s T20 World Cup Squad): హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), భారతీ ఫుల్మాలి, శ్రీ చరణి, యస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us