ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షల్లో మార్కులకు 50% వెయిటేజీతో అడ్మిషన్లు!
నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక జాతీయ అర్హత పరీక్షల నిర్వహణ కేంద్రానికి సవాల్గా మారింది. వరుస లీకులు, పరీక్షల రద్దుతో విద్యార్ధుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. ఈ ఏడాది జరిగిన నీట్ యూజీ 2026 లీకేజీ కారణంగా పదుల సంఖ్యలో విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..

న్యూఢిల్లీ, జులై 3: వివాదాలకు కేంద్రంగా మారిన ‘నీట్’ నిర్వహణ ప్రక్రియలో పలు మార్పులు అవసరమని పార్లమెంటరీ స్థాయీ సంఘం తాజాగా సూచించింది. ఇందులో పలు అంశాలను ప్రస్తావించింది. ప్రస్తుతం మాదిరి నీట్ పరీక్షను దేశ వ్యాప్తంగా ఒకే సమయంలో ఒకే రోజున ఒకే షిఫ్టులో నిర్వహించకుండా రాష్ట్రాలన్నింటిలో బహుళ స్థాయుల్లో నిర్వహించాలని ప్రతిపాదించింది. దీనివల్ల రవాణా సంబంధించిన ఒత్తిడిని, పరీక్ష నిర్వహణ ఏర్పాట్లలోని సంక్లిష్టతను చాలావరకు నివారించవచ్చని తెలిపింది.
మరోవైపు ఈ ప్రవేశ పరీక్షలకు ఉండే అత్యంత ప్రాధాన్యాన్ని తగ్గించడంద్వారా విద్యార్థుల్లో ఒత్తిడిని నివారించే ఉద్దేశంతో.. ప్రస్తుతం నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల స్కోర్లపై పూర్తిగా ఆధారపడి ఉన్న కీలక ప్రవేశాలలో బోర్డు పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజ్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. బోర్డు పరీక్షలు లేదా వైద్య, ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలు వంటి ఒక్కో పరీక్ష అధిక ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ ప్రతిపాదనను చేసింది. మూల్యాంకన లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీలతో సహా పలు అవకతవకల నేపథ్యంలో పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ ప్రతిపాదన తీసుకువచ్చింది. మెరిట్లో బోర్డు మార్కులకు 50 శాతం వెయిటేజ్ ఇవ్వడం, కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రవేశ పరీక్షలను పాఠశాల సిలబస్కు అనుసందానం చేయడం, బహుళ ప్రయత్నాలు, క్రమంగా అడాప్టివ్ ఆన్-డిమాండ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్లడం వంటి మార్పులు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హత పొందాలంటే అభ్యర్థులు తమ బోర్డు పరీక్షలలో నిర్దేశించిన అర్హత శాతాన్ని సాధించాల్సి ఉంటుంది. విద్యార్థులు కోచింగ్పై ఆధారపడటం, అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలలో నిష్పక్షపాతాన్ని అధ్యయనం చేయడానికి గత ఏడాది ఏర్పాటు చేసిన విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన 9 మంది సభ్యుల కమిటీ ఈ సంస్కరణలను పరిశీలిస్తోంది. ఈ కమిటీ తుది నివేదిక త్వరలోనే కేంద్రానికి సమర్పించనుంది. ప్రవేశ పరీక్షలను పాఠశాల సిలబస్కు మరింత దగ్గరగా అనుసంధానించాలని కూడా ఇది సిఫార్సు చేసింది.
దేశంలోనే అతి పెద్ద జాతీయ అర్హత- ప్రవేశ పరీక్ష ‘నీట్, జేఈఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా లక్షల్లో అభ్యర్థులు హాజరవుతారు. ప్రస్తుతం వైద్య, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలు ప్రవేశ పరీక్షల స్కోర్ల ఆధారంగా జరుగుతున్నాయి. ఇంతమందికి ఒకేరోజు పరీక్షను నిర్వహించడంలోని కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంబీబీఎస్, ఆయుష్, నర్సింగ్ కోర్సులకు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా తెరమీదకు వచ్చింది. ఇవన్నీ ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. నివేదిక వెలువడిన అనంతరం వీటిపై స్పష్టత రానుంది.




