క్లాసుల్లో మళ్లీ పాత పద్దతే.. విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!
కరోనా మహమ్మారి తర్వాత విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. డిజిటల్ బోధన పేరుతో స్మార్ట్ బోర్డుల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో నోయిడా విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్లాస్రూమ్లలో మళ్లీ పాతకాలపు నల్లబల్లల వినియోగాన్ని పునరుద్ధరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పిల్లలను డిజటల్ స్క్రీన్లను దూరం చేసి.. విద్యావిధానలో మళ్లీ పాత పద్దతులను అమల్లోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి విధానాన్నినే నోయిడా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ల వాడకం పెరగడం వల్ల పిల్లలు గంటల తరబడి తెరల ముందే గడుపుతున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే కంటి సమస్యలు, మానసిక ఒత్తిడి, దృష్టి లోపాలు ఎక్కువవుతున్నాయనే నిపుణులు హెచ్చరికలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోయిడా విద్యాశాఖ తెలిపింది. ప్రైమరీ నుంచి హైస్కూల్ విద్యార్థుల వరకు తరగతి గదిలో కేవలం 30 నుంచి 60 నిమిషాలకు మించి డిజిటల్ స్క్రీన్లు వాడకూడదని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
ఉపాధ్యాయులు మళ్లీ సుద్దముక్కలు, నల్లబోర్డులను ఉపయోగించి పాఠాలు చెప్పాలని సూచించారు. విద్యార్థులకు కూడా పలకలు ఇచ్చి సొంతంగా చేతితో రాసే అలవాటును పెంచాలని.. తద్వారా వారిలో ఏకాగ్రత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే నోయిడా యంత్రాంగం పాఠశాలల్లో సాంకేతికత వాడకాన్ని తగ్గించి, సాంప్రదాయ బోధన పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలు తమ పాఠ్య ప్రణాళికను తక్షణమే రీడిజైన్ చేయాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయులు ప్రతి పాఠాన్ని కేవలం ప్రెజెంటేషన్ల ద్వారా కాకుండా బోర్డుపై రాసి వివరించాలి. విద్యార్థులు నోట్స్ రాసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. దీనివల్ల పిల్లల్లో రాత నైపుణ్యాలు పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంపై డిజిటల్ పరికరాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ఇటీవల పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పిల్లల్లో సృజనాత్మకత తగ్గిపోయి యంత్రాల మాదిరిగా తయారవుతున్నారని తేలింది. అందుకే ఈ డిజిటల్ నిర్బంధం నుంచి పిల్లలకు విముక్తి కలిగించి, ఆటపాటలకు, ప్రత్యక్ష సంభాషణలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ కొత్త నిబంధనలను నోయిడాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. అధికారుల బృందాలు ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీ చేసి నిబంధనల అమలును పరిశీలిస్తాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరం మేరకే వాడుతూ, పిల్లల శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
